అమెరికా, ఇజ్రాయిల్ దేశాధినేతలు‘దేవుడి శత్రువులు’ ఇరాన్ మత గురువు ఫత్వా జారీ

by Shamantha N |   (  Updated:2025-06-30 07:15:44  IST  )

ఇరాన్ లో అత్యున్నత షియా మత గురువు అయతొల్లా నాసెర్ మకారెం షిరాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు లపై ఫత్వా జారీ చేశారు.

అమెరికా, ఇజ్రాయిల్ దేశాధినేతలు‘దేవుడి శత్రువులు’ ఇరాన్ మత గురువు ఫత్వా జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ లో అత్యున్నత షియా మత గురువు అయతొల్లా నాసెర్ మకారెం షిరాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు లపై ఫత్వా జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీరి చర్యలకు పశ్చాత్తాపం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరిద్దరిని ‘ దేవుడి శత్రువులు’గా అభివర్ణించారు. ఇస్లాంలో ఫత్వా అనేది మతపరమైన అంశం. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరిగిన 12 రోజుల యుద్ధానంతరం ఈ ఫత్వాను ఆయన జారీ చేశారు. మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన ప్రకారం.. ఆయతొల్లా షిరాజీ తన ప్రకటనలో మోహారెబ్ అనే ఇస్లామిక్ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. మోహారెబ్ అనగా ‘దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వారు’ అని అర్థం. ఇరానీయన్ చట్టాల ప్రకారం.. ఇది అత్యంత కఠిన శిక్షలకు దారితీస్తుంది. ఇందులో మరణదండన కూడా ఉండొచ్చు. లీడర్ లేదా మర్జా (దేవుడు రక్షించుగాక)కు ఎవరైనా ముప్పుగా మారితే వారు మోహారెబ్‌గానే పరిగణిస్తారని షిరాజీ తన ఫత్వాలో పేర్కొన్నారు.

ముస్లింలు, ముస్లిం దేశాలు సహకరించొద్దు

ఈ ఫత్వాలో, అమెరికా ఇజ్రాయెల్ ప్రభుత్వాలతో ముస్లింలు లేదా ముస్లింలను పాలించే దేశాలు ఏ విధమైన సహకారం, మద్దతు ఇచ్చినా అది హరాం (ఇస్లామిక్ న్యాయప్రకారం నిషిద్ధం)గా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పశ్చాత్తాపం పొందేలా చేయాలని ఫత్వాలో పేర్కొన్నారు. ఈ పిలుపు మేరకు చట్టబద్ధంగా వ్యావహారికంగా బాధలు ఎదుర్కొనేవారిని ‘దేవుని మార్గంలో యోధులుగా’ పరిగణించి వారికి ప్రతిఫలం లభిస్తుందని ఆయతొల్లా షిరాజీ అన్నారు. ఇరాన్ మతాధికారులు ఈ మేరకు ఫత్వాలను ఉపయోగించి హింసకు న్యాయం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందులోనే అత్యంత వివాదాస్పదంగా నిలిచింది 1989లో రచయిత సల్మాన్ రష్దీపై జారీ చేసిన ఫత్వా. ఇప్పుడు దీనిపై అమెరికా, ఇజ్రాయిల్ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Next Story