బీరుట్‌లో నలుగురు దౌత్యవేత్తలను చంపిన ఇజ్రాయెల్‌: యూఎన్‌కు ఇరాన్‌ లేఖ

by Ramesh Naini |

లెబనాన్ రాజధాని బీరుట్‌లో తమ దేశానికి చెందిన నలుగురు సీనియర్ దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ సంచలన ఆరోపణలు చేశారు.

బీరుట్‌లో నలుగురు దౌత్యవేత్తలను చంపిన ఇజ్రాయెల్‌: యూఎన్‌కు ఇరాన్‌ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో తమ దేశానికి చెందిన నలుగురు సీనియర్ దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేసిందని (United Nations) ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ఆయన లేఖ రాశారు. కావాలనే మార్చి 8వ తేదీన బీరుట్‌లోని రమదా హోటల్‌పై ఇజ్రాయెల్ సైన్యం (IDF) దాడి చేసిందని, ఈ ఘటనలో నలుగురు ఇరాన్ దౌత్యవేత్తలు ప్రాణాలు కోల్పోయారని ఇరవానీ తన లేఖల పేర్కొన్నారు. అంతకుముందు లెబనాన్‌లోని ఇరాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా వారిని తాత్కాలికంగా హోటల్‌కు తరలించగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వివరించారు. ఒక సార్వభౌమ దేశ ప్రతినిధులను మరో దేశ భూభాగంలో హత్య చేయడం హేయమైన ఉగ్రవాద చర్య అని అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలను, 1973 నాటి అంతర్జాతీయ రక్షణ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ ఉల్లంఘనలను శిక్షించకుండా వదలకూడదని ఇరవానీ లేఖలో స్పష్టం చేశారు.

హిజ్బుల్లా కమాండర్ హతం..

మరోవైపు, ఇజ్రాయెల్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. హిజ్బుల్లాకు నిధులు సమకూర్చే 'అల్-ఖర్ద్ అల్-హసన్ అసోసియేషన్' లక్ష్యంగా లెబనాన్‌లో పలుచోట్ల వైమానిక దాడులు నిర్వహించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా 'నాసర్' యూనిట్ కమాండర్ హసన్ సలామేను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. అంతేకాకుండా, ఇరాన్‌లోని టెహ్రాన్, తబ్రిజ్ నగరాల్లోని కీలక సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి కమాండ్ సెంటర్లు, బాసిజ్ బలగాల కాంపౌండ్లపై ఇజ్రాయెల్ బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి.

Next Story