ఉహించని ట్విస్ట్.. 'హోర్ముజ్ జలసంధి‌ని మరోసారి మూసివేసిన ఇరాన్

by Malleboina Mahesh |   (  Updated:2026-06-20 14:31:23  IST  )

శాంతి ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్! పర్షియన్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.

ఉహించని ట్విస్ట్.. హోర్ముజ్ జలసంధి‌ని మరోసారి మూసివేసిన ఇరాన్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం లో ఎవరూ ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు కేవలం మూడు రోజుల క్రితమే (జూన్ 18న) చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదిరినప్పటికీ.. శనివారం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని (Strait of Hormuz) ఓడల రాకపోకల కోసం మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సాయుధ దళాల అత్యున్నత సంయుక్త కమాండ్ 'ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ప్రకటించింది. ఈ నిర్ణయంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

సౌత్ లెబనాన్‌పై దాడులే కారణం..

చర్చల అనంతరం కుదిరిన శాంతి ఒప్పందం లోని మొదటి నిబంధనను అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఘోరంగా ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. దక్షిణ లెబనాన్‌లో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తుంగలో తొక్కి, నిరంతరాయంగా దాడులు చేస్తూ అమాయక పౌరుల మరణాలకు, వలసలకు కారణమవుతోందని ఇరాన్ మండిపడింది. లెబనాన్ నుండి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గకపోవడం, అమెరికా తన హామీలను నెరవేర్చడంలో విఫలం కావడం వల్లే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయాల్సి వచ్చిందని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రువుల నమ్మకద్రోహానికి ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, దురాక్రమణలు ఇలాగే కొనసాగితే మరిన్ని తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఈ సంక్షోభంపై చర్చల కోసం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ త్వరలోనే స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

Next Story