మరాఠా భూమిపై హిందీని బలవంతంగా రుద్దలేరు.. ఉద్దవ్, రాజ్ ఠాక్రే

by Shamantha N |

మరాఠా భూమిపై హిందీని ఎన్నటికీ బలవంతంగా రుద్దలేరని వర్లీలో జరిగిన బహిరంగ సభలో శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు.

మరాఠా భూమిపై హిందీని బలవంతంగా రుద్దలేరు.. ఉద్దవ్, రాజ్ ఠాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠా భూమిపై హిందీని ఎన్నటికీ బలవంతంగా రుద్దలేరని వర్లీలో జరిగిన బహిరంగ సభలో శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడవ భాషగా ప్రవేశపెట్టిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేపథ్యంలో, శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, రెండు దశాబ్దాల అనంతరం శనివారం ఒకే వేదికపై కనిపించారు. 'అవాజ్ మరాఠీచా' పేరుతో ముంబై వర్లీలోని NSCI డోమ్‌లో జరిగిన విజయోత్సవ సభలో, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, సంపాదకులు, మంగళవాద్యాలతో మరాఠీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ, ‘హిందూ, హిందుస్థాన్‌ ఆమోదయోగ్యమైనవి. కానీ హిందీని మరాఠా భూమిపై బలవంతంగా విధించడాన్ని అస్సలు సహించము. మీ ఏడు తరాలు వారు వచ్చినా మేము పోరాడుతూనే ఉంటాం’ అంటూ బీజేపీపై హెచ్చరించారు.

ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు

ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘రాజ్‌తో కలవడం ట్రైలర్ మాత్రమే ఇది మొదటి పాఠమే. మరాఠీ భాషా గౌరవానికి మా ఐక్యత కొనసాగుతుందన్నారు. ముంబైలో హిందీని మూడవ భాషగా విధించే రెండు జీవోలను వెనక్కి తీసుకోవడాన్ని ప్రజల విజయం గా అభివర్ణించిన ఆయన ‘మరాఠీ ప్రజల ఐక్యత ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టింది. హనుమాన్ చాలీసా, జై శ్రీరాం‌లకు మేము వ్యతిరేకం కాదు గాని, మరాఠీతో మీకెందుకు సమస్య?" అంటూ బీజేపీని ప్రశ్నించారు. ఈ ఐక్యవేదికపై రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, ‘హిందీ విధింపుకు వ్యతిరేకంగా పోరాడిన మరాఠీ మీడియా, కళాకారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఐక్యత మరాఠీ గౌరవానికి ప్రతీకగా నిలవాలి” అన్నారు. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ‘ఇప్పుడిప్పుడే కుటుంబం మళ్ళీ కలుస్తోంది రాజకీయాలకూ కలిసొచ్చే అవకాశముంది అని వ్యాఖ్యానించారు.

మరాఠీ ప్రజల కోసం కలిశాం

మరాఠీ భాష కోసం ప్రజల కోసం కలిశాం. కలిసి సాగుతామని ప్రకటించారు. ‘హిందూత్వం అనేది మీ (బీజేపీ) గుత్తాధిపత్యం కాదు. మేము కూడా హిందువులం. మీరు మాకు హిందూ మతం గురించి నేర్పించాల్సిన అవసరం లేదు. 1992లో ముంబైలో జరిగిన అల్లర్లలో హిందువులను రక్షించింది మరాఠీ ప్రజలే’ అని ఉద్ధవ్ థాకరే గుర్తు చేశారు. ‘మహారాష్ట్ర మంత్రి దాదా భూసే తన వాదన వినమని అడిగారు. నేను మీ మాట వింటాను కానీ ఒప్పుకోనని చెప్పాను . ఉత్తరప్రదేశ్, బీహార్ రాజస్థాన్‌లకు మూడవ భాష ఏది అని అడిగాను. హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాలు మన వెనుక ఉన్నాయి. మనం హిందీ మాట్లాడే అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాము. అయినప్పటికీ మనం హిందీ నేర్చుకోవలసి వస్తుంది ఎందుకు అని ప్రశ్నించానని’ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. అయితే బాల్ ఠాక్రే కూడా మమ్మల్ని ఏకం చేయలేకపోయారు. కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హిందీ భాష విషయంలో మమ్మల్ని ఏకం చేశారని రాజ్ ఠాక్రే అన్నారు.

Next Story