భూగర్భంలో సప్త సముద్రాలను మించిన మహా సముద్రం!

by Hajipasha |
భూగర్భంలో సప్త సముద్రాలను మించిన మహా సముద్రం!
X

దిశ, నేషనల్ బ్యూరో : శాస్త్రవేత్తలు భూమి కింద భారీ మహా సముద్రాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏడు మహా సముద్రాల కంటే అది చాలా పెద్దదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 7 మహా సముద్రాలలో ఉన్న నీటి కంటే 3 రెట్లు ఎక్కువ నీరు.. భూగర్భంలోని మహాసముద్రంలో ఉందని గుర్తించారు. భూమి ఉపరితలానికి దాదాపు 700 కిలోమీటర్ల అడుగున ఈ భారీ మహాసముద్రం ఉందని అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్‌లో ఉన్న నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సైంటిస్టులు నిర్వహించిన తాజా రీసెర్చ్‌లో వెల్లడైంది. భూగర్భంలోని రింగ్వుడైట్ అనే రకానికి చెందిన శిలాతలం లోపల భారీగా నీరు ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ‘‘డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్’’ అనే పేరుతో విడుదల చేసిన అధ్యయన నివేదికలో ప్రస్తావించారు. రింగ్వుడైట్ శిలలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ఇందులో వివరించారు.

ఇలా గుర్తించారు..

అధ్యయన నివేదిక ప్రకారం.. భూకంపాలను కొలిచే సీస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్‌ను గుర్తించడంతో భూమి అడుగున కూడా నీటి జాడ ఉందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. భూమి లోపల క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే 3 పొరలు ఉంటాయి. భూమి మ్యాంటిల్ జోన్‌లోని ఖనిజాల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్థం భారీ నీటి జలాశయమే అనే నిర్ధారణకు సైంటిస్టులు వచ్చారు.

రింగ్వుడైట్ రాయి స్పాంజిలా..

రింగ్వుడైట్ రాయి ఒక స్పాంజిలా ఉంటుంది. ఇది నీటిని పీల్చుకొని నిల్వ చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రాయి హైడ్రోజన్‌ను ఆకర్షించడం ద్వారా నీటిని నిల్వ ఉంచుకుంటోందని రీసెర్చ్‌ టీంలో కీలకపాత్ర వహించిన జియోఫిసిసిస్ట్ స్టీవ్ జాకబ్ సన్ వెల్లడించారు. భూమి పొరల్లో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం శాస్త్రవేత్తలు గత కొన్ని దశాబ్దాలుగా వెతుకుతున్నారని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed