అడవిలో అగ్ని ప్రమాదం: చిలీలో 46 మంది మృతి

by Dishanational2 |
అడవిలో అగ్ని ప్రమాదం: చిలీలో 46 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ చిలీలోని అడవిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 46కు చేరుకుంది. వాల్‌పరైసో అటవీ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో శనివారం ప్రారంభమైన మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ వెల్లడించారు. సుమారు 1100 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లు, ట్రక్కులను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్య్కూ సిబ్బందికి సహకరించాలని బోరిక్ ప్రజలను కోరారు. తీర ప్రాంత పర్యాటక నగరమైన వినా డెల్ మార్ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. చిలీలో గత దశాబ్దంలో సంభవించిన అటవీ మంటల్లో ఇది అత్యంత దారుణమైన ఘటన అని చిలీ విపత్తు ఏజెన్సీ తెలిపింది.

అధిక ఉష్ణోగ్రతే కారణం!

చిలీ మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. చిలీలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో 92 చోట్ల మంటలు వ్యాపించాయని తెలిపారు. సుమారు 43000 హెక్టార్లకు పైగా ప్రభావితమైనట్టు చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు భారీగా వ్యాపిస్తున్నట్టు తెలిపారు. వేలాది మంది నివాసితులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మంటలు సంభవించిన ప్రాంతం గతేడాది కంటే చాలా తక్కువగా ఉందని కానీ..ప్రభావితమైన హెక్టార్ల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించారు. కాగా, చిలీలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించడం సాధారణమే.



Next Story

Most Viewed