త్వరగా ఇరాన్ వదిలి వెళ్లిపోండి : భారత్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ

by Naga Rani Yarlagadda |

ట్రంప్ సీజ్ ఫైర్ ను మరో రెండువారాలు పొడిగించడంతో.. ఇరాన్ లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఇండియన్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

త్వరగా ఇరాన్ వదిలి వెళ్లిపోండి : భారత్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury)కి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల పాటు విరామం (Cease Fire) ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy Advisory) కీలక అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని (Expeditiously) సూచించింది. పౌరులంతా ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సూచించిన సురక్షిత మార్గాల్లోనే తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదని ఎంబసీ గట్టిగా హెచ్చరించింది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రతి కదలిక ఎంబసీ సమన్వయంతోనే జరగాలని, అప్పుడే భద్రతకు గ్యారంటీ ఉంటుందని స్పష్టం చేశారు. భారతీయుల సహాయార్థం ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. సహాయం కావలసినవారు +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359 అనే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

అంతకుముందు.. భద్రతా కారణాల దృష్ట్యా భారతీయులందరూ 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ సూచించిన సంగతి తెలిసిందే. సైనిక స్థావరాలకు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని, భవనాల పై అంతస్తుల్లోకి వెళ్లకూడదని గతంలోనే హెచ్చరించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉండేవారు కూడా తమ గదులకే పరిమితం కావాలని, అధికారులతో టచ్‌లో ఉండాలని ఆదేశించింది. ముఖ్యంగా హైవేలపై ప్రయాణాలు చేసే ముందు ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు తేల్చి చెప్పారు.

Next Story