కాల్పుల విరమణపై మరోసారి చర్చలు: యూఎస్ఏ, ఖతార్, హమాస్ ప్రతినిధుల భేటీ!

by Dishanational2 |
కాల్పుల విరమణపై మరోసారి చర్చలు: యూఎస్ఏ, ఖతార్, హమాస్ ప్రతినిధుల భేటీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణకు మరోసారి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈజిప్టులో అమెరికా, ఖతార్ హమాస్ ప్రతినిధులు భేటీ అయినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే నాటికి ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆరు వారాల పాటు కాల్పులు ఆపి వేయడం, ఇజ్రాయెల్ జైళ్ల నుంచి పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేయడం, హమాస్ బందీలను విడిపించాలనే ప్రతిపాదనపై డిస్కషన్ జరుగుతున్నది. ఇజ్రాయెల్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే గాజాకు మానవతా సాయం అందించడం వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. దీనిపై 48 గంటల్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని హమాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం

యుద్ధం నేపథ్యంలో గాజాకు అమెరికా తొలిసారిగా సాయం అందించింది. యూఎస్ సైనిక విమానం పారాచూట్ ద్వారా పాలస్తీనియన్ల కోసం ఆహార పెట్టెలను జారవిడిచింది. 38000 ఆహార ప్యాకెట్లు అందజేసింది. వీటిని సేకరించేందుకు ప్రజలు సముద్రంలోకి పరుగులు తీసినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పాలస్తీనియన్లకు మరింత చేస్తామని యూఎస్ తెలిపింది. సుమారు 22లక్షల జనాభా గాజాలో ఆకలితో అలమటిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు 24గంటల్లో 90 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


Next Story

Most Viewed