గాజాలో దాడి సరికాదు: ఇజ్రాయెల్‌పై బైడెన్, రిషిసునాక్ ఆగ్రహం

by samatah |
గాజాలో దాడి సరికాదు: ఇజ్రాయెల్‌పై బైడెన్, రిషిసునాక్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా ఉందన్నారు. గాజాలో సహాయక సిబ్బందిని రక్షించడానికి ఇజ్రాయెల్ తగిన చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ వేగంగా దర్యాప్లు చేపట్టాలని, విచారణ అనంతరం కారణాలను బహిరంగంగా వెల్లడించాలని పేర్కొన్నారు. సహాయక కార్మికులను రక్షించడానికి ఇజ్రాయెల్ మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాజాలో మానవతా సాయం అందిచడానికి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా కృషి చేయనున్నట్టు తెలిపారు.

మరోవైపు గాజాపై చేసిన దాడిలో బ్రిటీష్ పౌరులతో సహా పలువురు మరణించడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. గాజాలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. క్షిపణి దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో సహాయం చేస్తున్న కార్మికులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాక ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని యూకేలోని ఇజ్రాయెల్ రాయబారికి సమన్లు సైతం జారీ చేశారు.

కాగా, ఇజ్రాయెల్ మంగళవారం చేసిన వైమానిక దాడిలో మృతి చెందినవారంతా గాజాలో ఆహారాన్ని పంపిణీ చేస్తున్న ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ అనే స్వచ్ఛంధ సేవా సంస్థ తరఫున సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మృతుల్లో ఆస్ట్రేలియన్, పోలాండ్ వ్యక్తి, ఒక అమెరికన్-కెనడియన్ ద్వంద్వ పౌరసత్వం, ఒక అమెరికన్, ముగ్గురు బ్రిటీష్ పౌరులు, ఒక పాలస్తీనియన్‌ పౌరుడు ఉన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed