- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్లోని భారతీయులకు కేంద్రం అలర్ట్.. అనుమతి లేకుండా సరిహద్దులు దాటొద్దు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లోని భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక భారత రాయబార కార్యాలయం (Embassy) సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్లోని భారతీయులకు సూచించింది. ఈ మేరకు సోమవారం విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 550 మంది భారతీయులు భూభాగ సరిహద్దుల ద్వారా ఇరాన్ నుండి ఆర్మేనియా చేరుకున్నారని, మరో 90 మంది భారతీయులు అజర్బైజాన్కు తరలివెళ్లారని వెల్లడించారు.
సురక్షిత ప్రాంతాలకు విద్యార్థుల తరలింపు
తీర్థయాత్ర కోసం ఇరాన్ వెళ్లిన 284 మంది భారతీయులలో కొందరు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారు త్వరలోనే రానున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ముందస్తు జాగ్రత్తగా నగర శివార్లలోని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, క్షేత్రస్థాయిలో భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోందని స్పష్టం చేసింది. హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
విమాన సర్వీసుల వివరాలు..
గల్ఫ్ దేశాల నుంచి భారతీయుల తరలింపు ముమ్మరంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 2,20,000 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాల నుండి భారత్కు 45 విమానాలను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఖతార్ తన గగనతలాన్ని పాక్షికంగా తెరవడంతో అక్కడి నుంచి విమానాలు నడుస్తున్నాయని వెల్లడించారు. కువైట్ గగనతలం ఇంకా మూసివేసే ఉండటంతో, త్వరలోనే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బహ్రెయిన్, ఇరాక్ ప్రజలకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.






