Breaking news: కొండను ఢీకొన్న విమానం.. 29 మంది దుర్మరణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-01 03:27:35  IST  )

సైనికులతో వెళ్తోన్న విమానం ఓ కొండను ఢీ కొట్టికుప్పకూలింది. ఈ ప్రమాదంలో 29 మంది దుర్రణం చెందారు.

Breaking news: కొండను ఢీకొన్న విమానం.. 29 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా సైన్యానికి చెందిన రవాణా విమానం క్రిమియాలో ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో విమానంలోని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

అసలేం జరిగింది?

రష్యా వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. రష్యాకు చెందిన An-26 రవాణా విమానం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నల్ల సముద్ర తీరంలోని క్రిమియా ద్వీపకల్పంలో ఉన్న ఒక కొండను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే విమానానికి, కంట్రోల్ రూమ్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. కొండను ఢీకొన్న వేగానికి విమానం పూర్తిగా ధ్వంసమైందని, ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెల్లడించారు.

కారణం సాంకేతిక లోపమేనా?

ప్రమాదంపై రష్యా రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. విమానంలో తలెత్తిన తీవ్రమైన సాంకేతిక సమస్యలే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ సైనిక విమాన ప్రమాదం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా సైనిక రవాణా విమానాల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. మృతదేహాల వెలికితీత కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story