స్టేటస్ పెరిగినా.. భర్తలతో తిప్పలే

by  |
స్టేటస్ పెరిగినా.. భర్తలతో తిప్పలే
X

దిశ, ఫీచర్స్ : ఎన్నో పురాతన సంప్రదాయాలు, ఆచారాల నుంచి అప్‌డేట్ అయిన ఎడ్యుకేటెడ్ సొసైటీ.. ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. కుటుంబ వ్యవస్థలో అనాదిగా పాతుకుపోయిన పితృస్వామ్య భావాలను వదల్లేకపోతోంది. పైకి సమానత్వం, సాధికారిత అని గొప్పలు చెప్పుకుంటున్నా.. పాత పద్ధతులకే వంత పాడుతోంది. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం, డెసిషన్ మేకింగ్‌ సామర్థ్యాన్ని సాధించినట్లే కనిపిస్తున్నా సమస్య సమసిపోలేదు. మరో రూపంలో వారిని శక్తిహీనులుగా చేస్తోంది. తమ భర్తల ఆర్థిక స్థితికి ఈక్వల్‌గా లేదా మించిఉన్న మహిళలు(హైపర్‌గామస్ మ్యారేజెస్) గృహ హింసను ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా అధ్యయనం కనుగొంది. సంపాదిస్తున్న మహిళలు సహజంగానే నిర్ణయాధికారంలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇది పురుషాహంకారాన్ని దెబ్బతీస్తోంది. తమ కంటే భర్తల స్టేటస్ తక్కువగా ఉన్న సందర్భంలో డామినేషన్ పోరు కాస్త చివరకు డొమెస్టిక్ వయొలెన్స్‌కు దారితీస్తోందని నాటింగ్‌హామ్, యునైటెడ్ కింగ్‌డమ్ & ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళల్లో ఒకరిని డొమెస్టిక్ వయొలెన్స్ ప్రభావితం చేస్తోంది. కాగా ప్రస్తుత అధ్యయనం NFHS-4 డేటా, హింసకు సంబంధించిన ప్రశ్నలకు 15 – 49ఏళ్ల వయస్సు గల 65,806 మంది మహిళల ప్రతిస్పందనలను విశ్లేషించింది. సర్వేకు ముందు 12 నెలల కాలంలో 27% మంది శారీరక హింస, 5% లైంగిక హింస, 11% భావోద్వేగ హింస, 25% ఇతరత్రా హింసను ఫేస్ చేసినట్లు కనుగొన్నారు. కాగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందిస్తున్న కార్యక్రమాలు వారి శ్రేయస్సును కల్పించడం లేదని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. అందుకే లింగ సమానత్వ విధానాలు ఖచ్చితంగా అమలు చేయదగిన చట్టం, జోక్యాలతో కూడి ఉండాలని అధ్యయనం పేర్కొంది.

జనాభా అంతటా..

భారత్‌లో గత నాలుగు దశాబ్దాల కాలాన్ని పరిశీలించినట్లయితే.. భార్యల కంటే మెరుగైన విద్యను కలిగిన పురుషుల శాతం 90% -60%కు పైగా తగ్గిపోయింది. ఇదే సమయంలో భర్తల కంటే మెరుగైన విద్యను పొందిన మహిళల శాతం 10% -30%కు పైగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యావంతులైన మహిళలు పితృస్వామ్య, పురుషాధిపత్య చర్యలను ప్రశ్నించడంతో గృహ హింసకు గురవుతున్నారు. కాగా వీరు నివసిస్తున్న ప్రాంతం, పిల్లలు, ఇల్లు, కులం, ఫైనాన్షియల్ స్టేటస్, సగటు వయస్సు, వివాహ వ్యవధి వంటి పారామీటీర్స్ ఆధారంగా NFHS-4 డేటాను విశ్లేషించారు. హైపర్‌గామి నిబంధనల ఉల్లంఘన, గృహ హింసతో స్థిరంగా ముడిపడి ఉందని అధ్యయన రచయితలు కనుగొన్నారు. ఈ సహసంబంధం భారతదేశంలో మాత్రమే కాకుండా టాంజానియా, యూకే, ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించాయి.

స్వతంత్ర నిర్ణయాలు..

సాధారణంగా కుటుంబాల్లో ప్రాథమిక నిర్ణయాలన్నీ పురుషులే తీసుకోవాలని పితృస్వామ్య నిబంధనలు నిర్దేశిస్తాయి. అయితే ఈ నిబంధనలను అధిగమించి ట్రెడిషనల్ రోల్స్ రివర్స్ అయినప్పుడు ఏం జరుగుతుందో అధ్యయనం పరిశీలించింది. హైపర్‌గామస్ కాని(భర్తల కన్నా స్టేటస్ తక్కువగా ఉన్న మహిళలు) వివాహాలు పితృస్వామ్య లింగ విశ్వాసాలు, నిబంధనలను పెంచుతాయని స్పష్టం చేసింది. ఉదాహరణకు ఇంట్లో అవసరమైన గృహోపకరణాల కొనుగోలుపై కనీసం 3%, బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చినపుడు కనీసం 9%తో పాటు మహిళల సంపాదన ఖర్చుపై కనీసం 7% నిర్ణయాలు తీసుకునే అవకాశాలను నాన్-హైపర్‌గామస్ కాని వివాహాలు పెంచుతాయని తేలింది. ఇక భర్తలు ‘గృహహింస’ను తమ భార్యల ఉపాధి, పని అవకాశాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారని అధ్యయనం తెలిపింది. అలాంటి భర్తలు తమ భార్యలు ఇతర పురుషులతో సంభాషించడం పట్ల అసూయపడటం, అపనమ్మకంతో ఆరోపణలు చేయడం లేదా వారి ఆచూకీ తెలుసుకోవాలని పట్టుబట్టడం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. కాగా జెండర్ వయొలెన్స్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిరోధిస్తుండగా.. లింగ సమానత్వం సాధించడం వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి $ 700 బిలియన్లు పెరగవచ్చని 2015 మెకిన్సే నివేదిక పేర్కొంది.

సాధికారిత కార్యక్రమాలు సరిపోవు..

ఈ హింసను ఎలా పరిగణిస్తారనే విషయంలో ‘మహిళా అపరాధం’ ఒక కీలక అంశమని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన సౌమ్య ధనరాజ్ తెలిపింది. పనిచేయని మహిళల కంటే పని చేసే మహిళలు హింసను సమర్థిస్తారని తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. భర్తకు, తమ కుటుంబానికి చేసే పనులు వదిలేసి ఉద్యోగానికి వెళ్లే మహిళలు అపరాధ భావంతో ఉంటారని, కాబట్టి మహిళలు ఆర్థికంగా సాధికారత పొందినప్పటికీ, ఈ కష్టతరమైన నియమాలు మారడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. గత దశాబ్ద కాలంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అనేక మహిళా సాధికారత కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. కానీ ఈ ప్రచారాలతో పాటుగా గృహ హింసను సాధారణీకరించే సామాజిక విలువ వ్యవస్థలో మార్పులను లక్ష్యంగా చేసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. దీని అర్థం సామాజిక నిబంధనలను మార్చడం, లింగ హింసను నివారించడం, దానిని పరిష్కరించడానికి కమ్యూనిటీలను శక్తివంతం చేయడంతో పాటు గృహ హింసకు వ్యతిరేకంగా కమ్యూనిటీ, చట్టపరమైన మద్దతు అందించడం లక్ష్యంగా విధానాలను అమలు చేయాలి.

పాండమిక్ తర్వాత..

కొవిడ్ -19 మహమ్మారి, సంబంధిత లాక్‌డౌన్‌లు గృహ హింస కేసుల పెరుగుదలను చూశాయి. దీంతో లాక్‌డౌన్ సమయంలో గృహ హింసను నివేదించడానికి ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్’ వాట్సాప్ నంబర్‌ను ప్రారంభించింది. కేరళ ప్రభుత్వం టెలి-కౌన్సెలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ముంబై కేంద్రంగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థ అక్షర సెంటర్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘స్టాండప్ అగైనెస్ట్ వయొలెన్స్’ అనే వెబ్ యాప్‌ను ప్రారంభించింది. అదనంగా, NGOలు అత్యవసర కౌన్సెలింగ్, న్యాయ సహాయం, మానసిక ఆరోగ్య మద్దతు, ఆశ్రయం అందించడం ప్రారంభించాయి.

‘మహిళలకు అవసరమైన సాయాన్ని అందించే వ్యవస్థ ఇప్పటికీ మా వద్ద లేదు. హింసను తగ్గించడానికి ప్రయత్నించే సమర్థవంతమైన విధానాలకు ఆధారాలు లేనందున కాదు కానీ, దీనిపై చర్య తీసుకోవడంతో పాటు నివారణ కోసం ప్రస్తుతం మనకు నిజంగా కావలసింది రాజకీయ సుముఖత, పెట్టుబడులే.

– దారువల్లా, సొసైటీ ఫర్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ యాక్షన్

Next Story

Most Viewed