కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్న ‘ఆమె’

by  |
కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్న ‘ఆమె’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: భర్త చాటు భార్యగా కాకుండా, సతుల స్థానంలో పతుల పెత్తనంతో నడుచుకునే విధానానికి భిన్నంగా ముందుకు సాగుతున్నారామె. తనను గెలిపించిన ప్రజల క్షేమమే తన క్షేమమని భావిస్తూ నిరంతరం శ్రమిస్తున్న కరోనా ఫ్రంట్ లైన్ వారియర్ ఆ సర్పంచ్. ఏడాది కాలంగా ప్రజల్లో చైతన్యం తీసుకరావడమే కాదు , కరోనా బాధితుల సేవలో తలమునకలవుతున్నారు.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట సర్పంచ్ సత్య ప్రసన్న అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌తో చాలా మంది ప్రజాప్రతినిధులు సమాజానికి దూరంగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మహమ్మారి బారిన పడితే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదన్న భయం వెంటాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ సత్య ప్రసన్న మాత్రం తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల బాగోగులపైనే ప్రధాన దృష్టి సారించారు. ఫస్ట్ వేవ్ సమయంలో శానిటరీ సిబ్బందికి కరెన్సీ నోట్ల దండలు వేసి వారి సేవలు కొనియాడారు. సెకండ్ వేవ్ మొదలువుతున్న క్రమంలోనే మళ్లీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఊరంతా పాదయాత్ర చేస్తూ మహమ్మారి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.

కరోనా బాధితులను గుర్తించిన వెంటనే నిత్యం వారి ఇళ్లలో పంచాయితీ సిబ్బందిచే శానిటైజ్ చేయిస్తున్నారు. నిరుపేదలు కరోనా బారిన పడితే వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ అభాగ్యునికి కరోనా సోకడంతో ఇంటి యజమాని అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో గ్రామ శివార్లలో నిర్మాణంలో ఉన్న డబుల్ ఇళ్లలో ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించి అన్ని వసతలను సమకూర్చారు. కరోనా బాధితులు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఫోన్‌లో చెప్తే చాలు వారికి అవసరమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వంటింటికే పరిమితం కావాల్సిన ఆమె ఇంటింటికి తిరుగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా బాధితులు అత్యవసర వైద్యం కోసం కరీంనగర్‌కు వెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఎదురు చూసే పరిస్థితికి కూడా చెక్ పెట్టేశారు. తన కారులోను బాధితులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించేందుకు వినియోగించుకోవాలని కోరారు. నిరంతరం వైద్య సిబ్బంది సమన్వయంతో బాధితులకు అవసరమైన వైద్యాన్ని అందించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు సత్య ప్రసన్న.

అభివృద్దిలోనూ..

కేవలం కరోనా కాలంలోనే కాదు ఇతరాత్ర అభివృద్ది కార్యక్రమాల్లోనూ ముందు వసరలో నిలుస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రకృతి వనం, వైకుంఠ ధామం నిర్మించిన ఘనత గోపాల్ రావు పేట సర్పంచ్‌కే దక్కుతుంది. వైకుంఠ ధామం కోసం విరాళాలు సేకరించి మరి స్థలాన్ని కొనుగోలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్య ప్రసన్నతో అధికార పార్టీ సర్పంచ్‌లే పోటీ పడాల్సిన పరిస్థితి తయారైంది. గ్రామంలో డంప్ యార్డు, వర్మి కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలోనూ సఫలం అయ్యారు. అటు అభివృద్దిలో ఇటు కరోనా కట్టడితో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న సత్య ప్రసన్నకు హాట్సప్ చెప్పాలిందే.

జవాబుదారీ తనమే నా ధైర్యం..

నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు జవాబుదారి తనంతో సేవ చేయాలన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. కరోనా కష్ట కాలంలో అందరిలా నేనూ ఇంటికే పరిమితం అయితే సర్పంచ్‌గా గెలిచి కూడా ప్రయోజనం లేదు. ప్రథమ పౌరురాలిగా నేను ధైర్యాన్ని ప్రదర్శిస్తేనే ప్రజల్లోనూ మానసిక ధృడత్వం పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకుంటూ, శానిటైజర్ వినియోగిస్తూ ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నాను. కరోనా బాధితులకు అవసరమైన సేవలందించేందుకు పంచాయతీ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండడం కూడా నాకు కలిసి వస్తున్నది. నా భర్త, కూతురు నా ఆలోచనలకు అనుగుణంగా వెన్ను తట్టి ప్రొత్సహించడం మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. -సత్య ప్రసన్న

Next Story

Most Viewed