శ్రామిక శక్తిలో 30 శాతానికి పెరిగిన మహిళల ప్రాధాన్యత!

by  |
Women-workers
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రామిక శక్తిలో మహిళల పెరుగుదల రేటు 2018-19లో 24.5 శాతం నుంచి 2019-20లో 30 శాతానికి పెరిగిందని, అదే ఏడాదిలో నిరుద్యోగ రేటు 4.2 శాతం తక్కువగా నమోదైందని మంగళవారం కేంద్రం తెలిపింది. అంతేకాకుండా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ఎంఎన్ఆర్ఈజీఎస్) కిందకు వచ్చే మొత్తం ఉపాధిలో మహిళల వాటా 2019-20లో 145.35 కోట్ల నుంచి 2020-21లో 207 కోట్లకు పెరిగిందని పార్లమెంటులో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి రామేశ్వర్ చెప్పారు. అలాగే, మహిళల నిరుద్యోగిత రేటు 2018-19 మధ్య 5.1 ఉండగా, 2019-20లో 4.2 శాతానికి తగ్గిందని కేంద్రం పేర్కొంది. మహిళా కార్మికులకు అనుకూలమైన పని వాతావరణాన్ని సృష్టించేందుకు కార్మిక చట్టాల్లోనే రక్షణ నిబంధనలను చేర్చడంతో పాటు శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుందని వెల్లడించారు.

ఆ చర్యల్లో మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు చెల్లింపు చేయడం, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో తప్పనిసరిగా క్రీచ్ సదుపాయం కల్పించడం, రాత్రి షిఫ్టులలో మహిళా ఉద్యోగులకు తగిన భద్రతా చర్యలు తీసుకునేలా ఉంటాయని మంత్రి వివరించారు. మహిళల శ్రామిక శక్తిని పెంచేందుకు పారిశ్రామిక శిక్షణా సంస్థలు, జాతీయ వృత్తి శిక్షణా సంస్థలు, ప్రాంతీయ వృత్తి శిక్షణా సంస్థల నెట్‌వర్క్ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.



Next Story