హై అలర్ట్.. మావోయిస్టుల వేటలో మహిళా కమాండోలు

by  |
హై అలర్ట్.. మావోయిస్టుల వేటలో మహిళా కమాండోలు
X

దిశ, భద్రాచలం : మావోయిస్టుల వేట కోసం మహిళా కమాండోలు రంగంలోకి దిగారు. మావోయిస్టుల వారోత్సవాల వేళ మహిళా కమాండోలు వాగులు, వంకలు దాటుతూ దూసుకుపోతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని ఇంద్రావతి, కాంగేర్ నదుల పరివాహక దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే ఆ ప్రాంతానికి వానాకాలంలో భద్రతా బలగాలు చేరుకోవడం కష్టం. అందుకే ఆ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్ జోన్‌గా చేసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు.

ఈ క్రమంలో దంతెవాడ ఎస్పి అభిషేక్ పల్లవ్ నేతృత్వంలో సుశిక్షితులైన డీఆర్‌జీ, దంతేశ్వరి మహిళా కమాండోలు ప్రథమంగా ఈసారి రంగంలోకి దిగి కొండలు, గుట్టలు ఎక్కుతూ ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటుతూ గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ట్రైనింగ్ సెంటర్లు నెలకొల్పి కొత్త రిక్రూట్‌మెంట్స్‌కి శిక్షణ ఇస్తున్నట్లుగా పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో ఆ ఏరియాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా దంతేశ్వరి మహిళా కమాండోస్, డీఆర్‌జీ జవాన్లకు కఠోర శిక్షణ ఇచ్చి అవసరమైన సామాగ్రి సమకూర్చి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి బలగాలను రంగంలోకి దింపారు.

ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు వెళ్ళడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. మావోయిస్టులు ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేది వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టుల కంచుకోటలోకి భద్రతా బలగాలు ప్రవేశిస్తుండటంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

women commandos

Next Story