పసిబిడ్డతో చేయకూడని పనిచేసిన వివాహిత.. కుటుంబ సభ్యులు చూసి షాక్

by  |
jumps-into-pond1
X

దిశ, జడ్చర్ల: కుటుంబ కలహాల కారణంగా తన తొమ్మిది నెలల బిడ్డతోపాటు చెరువులోకి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన శ్రీశైలానికి, తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామంలో ఉంటున్న తన మేనమామ కూతురు సరిత(21)తో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. వివాహం జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు వారి కాపురం సజావుగా సాగినప్పటికీ రానురాను కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సరిత తన అత్త, భర్తతో పలుమార్లు గొడవ పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురిని తీసుకుని సరిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన భార్య ఆచూకీ కనిపించకపోవడంతో శ్రీశైలం మిడ్జిల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

గురువారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న మెల్లకుంటలో మహిళ మృతదేహం నీటిపై తేలుతున్న విషయాన్ని గుర్తించారు. సమాచారాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కొంతమందితో కలిసి కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా తల్లి, బిడ్డ మృతదేహాలుగా గుర్తించారు. తనతో పాటే తన కూతురును కొంగుతో ఎదకు ముడివేసుకుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు బయటకుతీసి పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలు ఆత్మహత్యకు ముందు తనభర్తకు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇదివరకే మిస్సింగ్ కేసు నమోదు కావడంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జయప్రసాద్ తెలిపారు.


Next Story

Most Viewed