ఇద్దరు భర్తల ముద్దుల భార్య.. 3 నెలల గర్భంతో ఉన్న ఆమె కోసం ఆ ఇద్దరు భర్తలు..

by  |
Wife
X

దిశ, వెబ్‌డెస్క్ : క్షణికానందం కోసం క్షణికావేశంలో కొందరు చేసే పనులు మొత్తం సమాజానికే మచ్చ తెచ్చేలా ఉంటాయి. పెళ్లై 22 ఏళ్లు భర్తతో కాపురం చేసి ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన ఓ ఇల్లాలు వారందరినీ వదిలేసి మరొకరిని వివాహమాడటం వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పరాయి మగాడి మోజులో పడ్డ ఆమె.. అసలు తనకు పెళ్లే కాలేదని, పిల్లలు కూడా లేరని చెప్పడం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. మరోవైపు ఒక్కగానొక్క భార్య కోసం ఇద్దరు భర్తలు పోలీస్ స్టేషన్ల చుట్టు తిరగడం అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తోంది. హన్మకొండలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హన్మకొండ టీచర్స్ కాలనీ-2కు చెందిన ఉదయ్ కాంత్(42) భార్య నాగ సత్యావతి (35) (ఇద్దరి పేర్లు మార్చాం) నివసిస్తున్నారు. స్థానికంగా ఓ దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్న ఉదయ్ కాంత్‌కు పెద్దల సమక్షంలో 1999 ఫిబ్రవరి 2న నాగ సత్యావతితో వివాహం జరిగింది. వీరిద్దరికి 16 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హ్యాపీగా సాగుతోన్న వీరి సంసారం ఒక్కసారిగా బజారున పడింది. ఉన్నట్టుండి నాగ సత్యావతి ఆగస్ట్ 20న తన పుట్టింటికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. భార్య కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఇంట్లో పరిశీలించగా.. రూ.లక్ష నగదుతోపాటు 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు.

ఇదే సమయంలో మరో షాకింగ్ వార్త భర్త ఉదయ్ కాంత్‌కు తెలిసింది. నాగ సత్యావతి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం మండలం కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యవరప్రసాద్‌తో కలిసి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయన సుబేదారి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తన ఇంట్లో నగదు, నగలతో ఇద్దరు కలిసి ఉడాయించారని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే నాగ సత్యావతి పోలీసులకు చుక్కలు చూపించింది. అసలు ఉదయ్ కాంత్‌ తన భర్త కాదని.. పిల్లలు కూడా తనకు పుట్టలేదని పేర్కొంది. తన అక్క చనిపోతే చుట్టపు చూపుగా అతడి ఇంటికి వెళ్లానని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో వాళ్లను కాంప్రమేజ్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. దీంతో ప్రియుడు, ప్రియురాలిని కోర్టులో హాజరు పరిచారు.

కానీ పోలీసుల విచారణలో ఉదయ్ కాంత్, నాగ సత్యావతి ఇద్దరు భార్యభర్తలేనని, పిల్లలు సైతం వారి సంతానమేనని తేలింది. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన ప్రేమికులు ఇద్దరు హైదరాబాద్‌లోని బల్కంపేట ప్రశాంత్ నగర్‌లో కాపురం పెట్టి సహజీవనం చేయసాగారు. ఈ క్రమంలో ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాలల్లో ఈ లవర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ కాంత్.. మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. తన పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారని, వెంటనే ఆమెను తమతో కలపాలని ఫిర్యాదు చేశాడు. అయితే మొదటి భర్తకు షాకిస్తూ రెండవ భర్త హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశాడు. మూడు నెలల గర్భవతి అయిన తన భార్య కనిపించడం లేదని, ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు. ఇంతకూ నాగ సత్యావతి అదృశ్యం అయిందా లేక మొదటి భర్త దగ్గరకు వెళ్లలేక రెండో భర్తతో కలిసి డ్రామాలకు తెరలేపిందా అనేది తేలియాల్సి ఉంది. మరోవైపు నాగ సత్యావతి ఆచూకీ కోసం ఎస్సార్ నగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed