బార్డర్‌లో పుట్టిన ‘బార్డర్’.. నెట్టింట వైరల్

by  |
బార్డర్‌లో పుట్టిన ‘బార్డర్’.. నెట్టింట వైరల్
X

దిశ, ఫీచర్స్: భారత్-పాక్ సరిహద్దులోని అటారీ ప్రాంతంలో చిక్కుకున్న పాకిస్థానీ దంపతులు 70 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. తాజాగా వారికి మగ బిడ్డ పుట్టగా.. ‘బార్డర్’ గా నామకరణం చేసి వార్తల్లో నిలిచారు. డిసెంబర్ 2న పుట్టిన ఈ బిడ్డ పేరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలం రామ్‌ దంపతులు.. గత 71 రోజులుగా 97 మంది ఇతర పాకిస్తానీ పౌరులతో కలిసి అటారీ సరిహద్దు లో చిక్కుకుపోయారు.

కాగా ఇండో-పాక్ సరిహద్దుల్లో జన్మించినందు వల్లే తమ బిడ్డకు ‘బార్డర్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ నెల 2న నింబు బాయికి నొప్పులు రావడంతో.. సమీపంలోని పంజాబ్ గ్రామాల నుంచి కొంతమంది మహిళలు సాయం చేసేందుకు వచ్చారని వెల్లడించారు. స్థానికులు కూడా ప్రసవం కోసం వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇక తనతో పాటు భారతదేశానికి తీర్థయాత్రల కోసం వచ్చిన ఇతర పాకిస్తాన్ పౌరులు అవసరమైన పత్రాలు లేకపోవడంతో తిరిగి స్వదేశానికి చేరుకోలేక పోయినట్లు పిల్లవాడి తండ్రి బాలం రామ్ చెప్పారు. 97 మంది పౌరుల్లో 47 మంది పిల్లలు ఉండగా.. వారిలో ఆరుగురు భారతదేశంలోనే జన్మించారు. ఇక సరిహద్దులో ఉన్న మరో పాకిస్థానీ పౌరుడు లగ్యరామ్ గతేడాది డిసెంబర్‌లో పుట్టిన తన కొడుకుకు ‘భరత్’ అని పేరు పెట్టాడు. స్థానికులు వారికి మూడు పూటలా భోజనం, మందులు, దుస్తులు అందిస్తుండటం విశేషం.



Next Story

Most Viewed