భళా ‘కలంకారీ’.. విశ్వవ్యాప్తమైన భారతీయ ప్రాచీన హస్తకళ

by  |
Pitchuka
X

దిశ, ఫీచర్స్ : 1986‌లో ఇండియా ఇంటర్నెట్‌ను స్వాగతించగా.. తొంభయ్యో దశకం చివరినాటికి రెడిఫ్.కామ్ దేశంలో మొట్టమొదటి సైబర్ కేఫ్‌ను ముంబైలో ప్రారంభించింది. ఇదే క్రమంలో ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ దేశవ్యాప్తంగా అనుసంధానించబడింది. ఇలా కొత్త సహస్రాబ్దిలో దిగ్గజ సంస్థలు ఇంటర్నెట్ ప్రయోజనాలను అన్వేషిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న నేతకారి, వరల్డ్ వైడ్ వెబ్ సహాయంతో ‘కలంకారి కళారూపాన్ని’ విశ్వవ్యాప్తం చేసేందుకు ముందడుగు వేశాడు. నాడు ఆయన వేసిన బీజం నేడు మహావృక్షమై, మన సంప్రదాయ కళారూపానికి విదేశాల్లోనూ బహుళ ఆదరణ చూరగొనేలా చేసింది. ఆ హస్త కళాకారుడే పిచ్చుక శ్రీనివాస్.

Kalamkari fabrics

ఏపీ, మచిలీపట్నానికి చెందిన పిచ్చుక వీర సుబ్బయ్య 1970లో కలంకారీ ముద్రణ ప్రక్రియ నేర్చుకున్నాడు. ఈ మేరకు తండ్రి రూపొందిస్తున్న కలంకారి వస్త్ర సోయగాలను దగ్గరి నుంచి చూసిన కొడుకు శ్రీనివాస్ చిన్నప్పటి నుంచే ఈ క్రాఫ్ట్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఆ ఇష్టంతో చదువుకుంటూనే కలంకారీ కళను సాధనం చేయడం ప్రారంభించాడు. నిజానికి ఇది చాలా ఓర్పుతో నేర్చుకోవాల్సిన కళ. ప్రతి నమూనాపై పట్టు సాధించాలంటే మాటలు కాదు. అయితే వివిధ ప్రాంతాల్లోని నిపుణుల సలహాలు, సూచనలు ఫాలో అయిన సుబ్బయ్య టెక్నిక్స్ గ్రహించగలిగాడు. వెంటనే స్నేహితుడితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించిన తను.. ప్రింట్స్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నాడు. కానీ కొరియర్ సేవలు, ఇంటర్నెట్ లేకపోవడం వల్ల స్థానికంగానే విక్రయించగలిగినా అంతగా ఆదరణ దక్కలేదు. తక్కువ ఆదాయ మార్జిన్లు, క్రాఫ్ట్ పరంగా ఎదురయ్యే ఇతర సమస్యలను పట్టించుకోని శ్రీనివాస్ మాత్రం.. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

Kalamkari

న్యూయార్క్ స్టోర్ ‘లెస్ ఇండియన్స్’లో అమ్మకాలు..

ఇంటర్నెట్ రాక శ్రీనివాస్ ఆశలకు రెక్కలు తొడిగింది. 2001లో న్యూయార్క్ కేంద్రంగా ఉన్న మేరీ బెర్గ్‌టొల్డ్ ముల్కాహి అనే మహిళ.. కలంకారీ ఫాబ్రిక్ అవసరార్థం ఇండియామార్ట్‌లో ఒక ప్రకటన ఇచ్చింది. అది చూసిన శ్రీనివాస్.. ‘మేడమ్, నా పనిని మీకు చూపించడానికి నేను ఇష్టపడతాను. కానీ శాంపిల్స్ పంపించేంత ఆర్థికస్థోమత నాకు లేదు’ అంటూ ఈమెయిల్ చేశాడు. శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం, అతని నిజాయితీ ‘హార్పర్స్ బజార్ మ్యాగజైన్’ మాజీ ఫ్యాషన్ ఎడిటర్ మేరీని ఆకట్టుకుంది. వెంటనే శ్రీనివాస్ రూపొందించిన కలంకారీ ముద్రణ కళా నమూనాలను కొరియర్ చేయడానికి అతనికి యూఎస్ డాలర్లు పంపింది. దీంతో ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి ఆదరణ అందుకుంటున్న జాతీయ పత్రికలో శ్రీనివాస్ శాంపిల్స్ ప్రచురితమయ్యాయి. ఈ కొలాబరేషన్.. 2002లో మేరీ తన స్టోర్ ‘లెస్ ఇండియెన్స్’లో భారతీయ కలంకారీ ఫాబ్రిక్ అమ్మకాలు ప్రారంభించేందుకు స్ఫూర్తినిచ్చింది. టేబుల్ డెనిన్, దిండ్లు, బెడ్డింగ్, కుషన్ కవర్లు వంటి గృహోపకరణ వస్తువులను విక్రయించగా, అవి అమిత ఆదరణ అందుకున్నాయి. ఈ విధంగా 400 సంవత్సరాల పురాతన కళ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. సాంప్రదాయ పద్దతులు పాటిస్తూ, ఆధునికతను జోడించడం వల్లే తమ కలంకారీ బట్టలు జపాన్, నెదర్లాండ్స్, యూకే, యూఎస్ఏ, జర్మనీ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపాడు.

Weaver

కలంకారీ అంటే.. వెదురుతో చేసిన కలంతో సహజ రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే కళ. ఇది చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలో పుట్టిందని చెబుతారు. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లో లభించిన ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది కాబట్టి, అక్కడి మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. గోల్కొండ ప్రభువులు ఈ చిత్రకళను అమితంగా ఇష్టపడేవారు. కలంకారీ చిత్రకారుల హస్తకళా కౌశలాన్ని చూడటం కనులకు విందుగా వర్ణిస్తారు. ఇది ఓర్పుతో, మిక్కిలి శ్రమతో కూడుకున్న హస్తకళ. డైయింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, బ్లీచింగ్, క్లీనింగ్ వంటి మరెన్నో దశల్లో కలంకారీ వస్త్రరూపం రూపొందుతుంది. ఇక డిజైన్లు, రంగులద్దడంలో.. మచిలీపట్నం కలంకారీ వస్త్రాలకు మించినవి మరొకటి లేవని చరిత్ర చెబుతుండగా.. ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రాంకాయిన్స్ బెర్నీర్ కూడా తన పుస్తకంలో దీని గురించి వర్ణించాడు. నిజాం కాలంలో విదేశీయులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి, వాటిని తీసుకెళ్లే వారని ప్రసిద్ధి. కాగా ఆంధ్ర దేశంలో ఈ హస్తకళ ఎంతో ఖ్యాతిని గడించి ప్రపంచ కలంకారీ చరిత్రలో ఓ విశిష్ట స్థానాన్ని పొందింది.

రంగు వెలికితీత ప్రక్రియ ఓ మాయాజాలం..

Srinivas
నా ఇల్లు వర్క్‌షాప్ అయితే, స్థానిక సైబర్ కేఫ్ నా ప్రార్థనా స్థలంగా మారింది. రెండేళ్ల పాటు ఈమెయిల్ ద్వారానే మా చర్చలు నడిచాయి. డిజైన్లతో పాటు మా ప్రక్రియ, మేము ఉపయోగించే ముడి పదార్థాలు మేరీని బాగా ఆకట్టుకున్నాయి. సేంద్రియ పదార్థాలను, 16వ శతాబ్ధంలో ఉపయోగించిన బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్‌ను వాడటం వల్లే మా వస్త్రాలు అంత ప్రత్యేకత సంతరించకున్నాయి. రసాయన రహిత, అధికారులు ధృవీకరించిన సేంద్రియ వస్త్రం, నూలును ఉపయోగించడం మా తరంలో నాతోనే మొదలైంది. చిన్నప్పుడే కలంకారీ ప్రేమలో పడిపోయా. ఇందులో వస్త్రం వర్ణరంజితంగా మారడం.. కూరగాయలు, పండ్ల నుంచి రంగు వెలికితీత ప్రక్రియ అంతా ఓ మాయాజాలం. ఈ రంగులు ప్రకృతికి, జీవులకు ఎటువంటి హాని చేయవు. నాన్న మరణించడంతో పదో తరగతి పూర్తికాకుండానే ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను. ప్రస్తుతం నా కుమారుడు వరుణ్ కూడా వ్యాపారంలో చేరడం సంతోషకరమైన విషయం.
– పిచ్చుక శ్రీనివాస్, కలంకారీ నేత


Next Story

Most Viewed