మంత్రివర్గంలోకి కవిత?

by  |
మంత్రివర్గంలోకి కవిత?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులంతా ఇప్పుడు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ప్రసన్నం చేసుకోవడంలో పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో జిల్లా పార్టీలో కొత్త జోష్ నెలకొంది. ఇక ఆమె గెలుపు లాంఛనమే అనే అభిప్రాయం నెలకొంది. అయితే అక్కడితోనే వారి సంతోషం ఆగలేదు. త్వరలో రాష్ట్ర మంత్రి కావడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్సీగా గెలవగానే మంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే షకీల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 14న శాసనమండలి సమావేశం అవుతున్న సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే ఆమెకు విప్ బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం.

మంత్రివర్గంలోకి తీసుకోవడంపై పార్టీ వర్గాల్లో రెండు మూడు రకాల ఆప్షన్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫుల్ కేబినెట్ ఉన్నందున కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అలాంటి చర్యలు ఉండకపోవచ్చన్నది ఒక ఆప్షన్. ప్రస్తుతానికి విప్ పదవితో సరిపెట్టి సరైన సమయంలో మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది రెండవ ఆప్షన్. కేవలం ఈమెకు మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఒకరిని తప్పిస్తున్నారంటూ వచ్చే విమర్శలకు తావులేకుండా మొత్తం మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే పేరుతో నలుగురైదుగురికి మార్పులు చేయడం ద్వారా అవకాశం కల్పించాలన్నది మరొక ఆప్షన్. ఆప్షన్లు ఎన్ని ఉన్నా మంత్రి కావడం ఖాయమనేది మాత్రం నిజామాబాద్ జిల్లా నేతల్లోనేకాక రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనే బలంగా వినిపిస్తోంది.

బిగాల గణేశ్ వ్యాఖ్యలతో జోరుగా ప్రచారం

జిల్లాలో రెండేండ్లుగా అభివృద్ధి పడకేసిందని పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా కామెంట్ చేశారు. అది నిజమేనంటూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వంతపాడారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా పనిచేసే వారికి, మోసం చేసేవారికి మధ్య పోరులో ధర్మమే గెలుస్తుందని కవిత ఎమ్మెల్సీగా గెలవడం, మంత్రి కావడం తథ్యం అనే తీరులో వ్యాఖ్యానించారు. జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు శాసనసభ, శాసనమండలి సభ్యులంతా కవిత గెలుపు ఖాయమని, త్వరలోనే ఆమెను మంత్రి పదవి వరిస్తుందని వారు బహిరంగంగానే వ్యాఖ్యానించుకున్నారు.

ఇప్పటికే కేబినెట్‌లో ఇద్దరు మహిళా మంత్రులు ఉండగా, కవితకు మంత్రి పదవి ఇస్తే ఎవరు త్యాగం చేస్తారనే చర్చ కూడా అదే సమయంలో మొదలైంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు పదవిని త్యాగం చేయాల్సి రావొచ్చనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మహిళా మంత్రులకు అదనంగా కవితను మంత్రిని చేయాల్సి వస్తే జిల్లా, సామాజికవర్గం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గం కూర్పులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉండగా అదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కవితకు అవకాశం కల్పిస్తే ఒక్క జిల్లా నుంచి స్పీకర్‌తో సహా కలిపి మూడు పదవులు అనే చర్చ కూడా మొదలవుతుంది. ఇలాంటి అన్ని అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత పార్టీ అధినేతగా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడైనా కాస్త ఆలస్యమైనా మంత్రి కావడం ఖాయమనే బలమైన వాదన వినిపిస్తున్నందున ఇప్పటి నుంచే ఆమెను ప్రసన్నం చేసుకోవడంపై నేతలు దృష్టి పెట్టారు.



Next Story

Most Viewed