వేర్వేరు టీకాలు కలిపి ఇస్తే సామర్థ్యం పెరిగేనా..?

by  |
vaccination
X

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు తొలి డోసు ఇచ్చిన కంపెనీ టీకానే రెండో డోసుగా ఇస్తున్నారు. కానీ, రెండు వేర్వేరు డోసులు ఇస్తే కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం అధికంగా ఉంటుందా? అనేది తేల్చడానికి త్వరలో ప్రయోగాలు జరగనున్నాయి. ఈ ట్రయల్స్ మరో నెల రోజుల్లో మొదలయ్యే అవకాశముందని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ హెడ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. ఈ ట్రయల్స్ రెండు నుంచి రెండున్నర నెలల వరకు జరగవచ్చని వివరించారు. యూపీలో కొందరు రెండు వేర్వేరు టీకా డోసులు పొందినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, అలాగే, తొలి డోసు, మలి డోసు వేర్వేరు టీకాలకు చెందినవి వేస్తే దాని సామర్థ్యం పెరిగే అవకాశముందా? అనే విషయాన్ని పరిశీలించనున్నారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్‌లో భాగంగా కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఉన్నది.

రోజుకు కోటి టీకాల పంపిణీ లక్ష్యం

సీరం ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా జూన్ చివరి వరకు 10 నుంచి 12 కోట్ల టీకా డోసులను అందుబాటులో ఉంచుతామని ఇటీవలే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, భారత్ బయోటెక్ కూడా టీకా డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నట్టు తెలిసిందే. జులై చివరి వరకు భారత్ బయోటెక్ 10 నుంచి 12 కోట్ల డోసులను అందించనున్నట్టు తెలిపిందని డాక్టర్ ఎన్‌కే అరోరా వివరించారు. సీరం, భారత్ బయోటెక్ రెండూ దాదాపు 50శాతం ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం గమనార్హం. దేశంలో ఆగస్టు వరకు నెలకు 25 కోట్ల దేశీయ టీకా డోసులు అందుబాటులో ఉంటాయని ఆయన అంచనా వేశారు. మరో ఐదు నుంచి ఆరు కోట్ల టీకా డోసులను ఇతర తయారీదారుల నుంచి సేకరిస్తామని, లేదా విదేశీ సంస్థల నుంచి టీకాలు పొందే అవకాశమూ ఉన్నదని వివరించారు. ఎట్టకేలకు రోజుకు కోటి టీకాల పంపిణీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతున్నదని పేర్కొన్నారు.

Next Story