వార్ వన్ సైడ్ అవుతుందా.. ‘తీన్మార్’ గెలుస్తాడా..?

by  |
వార్ వన్ సైడ్ అవుతుందా.. ‘తీన్మార్’ గెలుస్తాడా..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ క్షణ క్షణం ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే 68 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా, మూడో స్థానంలో ఉన్న కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే రెండో ప్రాధాన్యత ఓట్లను పల్లా, తీన్మార్‌లకు బదలాయింపు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దాదాపు 6వేల ఓట్ల వరకు రెండో ప్రాధాన్యత ఓట్లను కౌంట్ చేసినట్టు సమాచారం. ఇందులో 50 నుంచి 60 ఓట్లు తీన్మార్ మల్లన్నకు, 40 నుంచి 50 ఓట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

గెలుపు కోటాలో 1,83,167 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. ఇప్పటివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,32,687 ఓట్లతో ఉండగా, మరో 51వేల ఓట్లు వస్తేనే.. ఆయన గెలుపు కోటాను చేరుకుంటారు. రెండో స్థానంలో ఉన్న తీన్మార్ మల్లన్నకు 1,08,104 ఓట్లు ఉన్నాయి. ఆయన గెలుపు కోటాకు చేరుకోవాలన్నా.. విజేతగా నిలిచే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలన్నా.. కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియలో దాదాపు 30వేలకు పైచిలుకు ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీన్మార్ మల్లన్న కంటే 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అయితే పల్లా సైతం అందరూ అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లను రాబట్టుకోవడంలో మూడో స్థానంలో నిలుస్తూ వచ్చారు. మొదటి, రెండో స్థానాల్లో కోదండరామ్, మల్లన్న కొనసాగారు. ఇదిలావుంటే.. టీఆర్ఎస్ శ్రేణులు కోదండరామ్ రెండో ప్రాధాన్యత ఓట్లనూ 20 నుంచి 30 శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న.. కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియలో 70 శాతం ఓట్లు తనకు వస్తాయని చెబుతున్నారు. దీంతో వార్ వన్ సైడ్ అయితే తప్ప తీన్మార్ మల్లన్న పల్లాను ఢీకొట్టే పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.



Next Story

Most Viewed