మండలిలో మల్లన్న ‘తీన్మార్’ స్టెప్పులేసేనా..?

by  |
మండలిలో మల్లన్న ‘తీన్మార్’ స్టెప్పులేసేనా..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : అతనో సాధారణ జర్నలిస్టు. ఏ పార్టీ సభ్యుడు కాదు. కనీసం ప్రాథమిక సభ్యత్వమూ లేదు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడో ప్రభంజనంలా మారాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలు, హేమాహేమీలు బరిలోకి దిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన హవాను కొనసాగిస్తున్నాడు. అతడే ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. వాస్తవానికి పోలింగ్ ముందు వరకు కనీసం ఒక అభ్యర్థిగానూ అతడిని ప్రధాన పార్టీలు గుర్తించలేదు. సాధారణ జనం సైతం అతడేం ప్రభావం చూపుతాడులే అనుకున్నారు. తోటి జర్నలిస్టు మిత్రులు సైతం పెద్దగా ఖాతరు చేయలేదు. కానీ ఇప్పడంతా పరిస్థితి మారిపోయింది. తీన్మార్ మల్లన్న అనుహ్యంగా ప్రధాన పోటీలో నిలిచాడు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే కాదు.. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. యావత్ తెలంగాణ విద్యార్థి లోకం తన వెంట నడుస్తుందని భావించే ప్రొఫెసర్ కోదండరామ్‌ను సైతం వెనక్కి నెట్టి రెండో వరుసలోకి చేరిపోయాడు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న అంశమే చర్చనీయాంశంగా మారింది.

మొదటి నుంచి రెండో స్థానంలోనే..

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరతానంటూ తీన్మార్ మల్లన్న మొదట్నుంచి చెబుతూ వచ్చారు. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ నుంచి పల్లాకు గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. తొలి స్థానంలో కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి రౌండ్‌లో 16,130 ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు 12,046 ఓట్లు దక్కాయి. రెండో రౌండ్‌లోనూ పల్లాకు 15,857 ఓట్లు వస్తే.. తీన్మార్‌కు 12,070ఓట్లు, మూడో రౌండ్‌లో రాజేశ్వర్ రెడ్డికి 15,558 ఓట్లు వస్తే.. మల్లన్ననకు 10,748 ఓట్లు వచ్చాయి. మొత్తంగా మూడు రౌండ్లలో పల్లాకు 47,545 ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు 34,864 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ నుంచి పల్లా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తే.. మల్లన్న సైతం మొదటి రౌండ్ నుంచి రెండో స్థానంలోనే కొనసాగుతూ వస్తున్నారు.

ఎలాంటి అంచనాలు లేకుండా..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు తీన్మార్ మల్లన్న గట్టిపోటీ ఇస్తూ వస్తున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హేమాహేమీలను పక్కకు నెడుతూ రెండో స్థానంలో సెటిల్ అయ్యాడు. ఇంకా నాలుగు రౌండ్లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే మీమాంస అధికార పార్టీలోనూ వణుకు పుట్టిస్తోందనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న కొంతమంది ప్రధాన అభ్యర్థులతో పోల్చుకుంటే.. తీన్మార్ మల్లన్నకు పెద్దగా సపోర్టు లేదనే చెప్పాలి. పల్లాకు టీఆర్ఎస్ సపోర్టు ఉండగా, రాములునాయక్‌కు కాంగ్రెస్, ప్రేమేందర్ రెడ్డికి బీజేపీ, కోదండరామ్‌కు టీజేఎస్, చెరుకు సుధాకర్‌కు తెలంగాణ ఇంటి పార్టీ, రాణిరుద్రమకు యువతెలంగాణ పార్టీల మద్దతు పుష్కలంగా ఉంది. వారికి పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలోనూ బలంగా ఉన్నారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో అలాంటివేమీ లేవు. కేవలం తన స్వశక్తితోపైనే ఆధార పడుతూ సోషల్ మీడియా వేదికలను సద్వినియోగం చేసుకుంటూ పట్టభద్రుల్లోకి వెళ్లగలగడం మాములు విషయమేమీ కాదు. ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న చివరి వరకు గట్టి పోటీ ఇస్తారనడంలో ఏలాంటి సందేహం లేదనే చెప్పాలి.



Next Story

Most Viewed