హైదరాబాద్‌లో.. ఢిల్లీ తరహా అల్లర్లు పునరావృతమయ్యేనా!

by  |
హైదరాబాద్‌లో.. ఢిల్లీ తరహా అల్లర్లు పునరావృతమయ్యేనా!
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతోంది. ఇలాంటి సమయంలో ప్రశాంత వాతవరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేని హైదరాబాద్‌ మహానగరంలో బీజేపీ సీఏఏ‌పై అమిత్ షాతో అవగాహన సభ నిర్వహించడానికి సిద్ధమవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లో కూడా ఢిల్లీ తరహా అల్లర్లు చెలరేగనున్నయా..! అన్న భయంతో హైదరాబాద్ అట్టుడికి పోతుంది. సభకు అనుమతులు ఇవ్వొద్దని విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులకు వినతులు ఇస్తున్నప్పటికీ.. ఈ సభ ఏర్పాట్లలో స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తుండటంతో.. పోలీసులు అమిత్ షా సభకు అనుమతి ఇవ్వక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మార్చి 15న రాష్ర్ట రాజధానిలో ఏమీ జరగబోతుంది..అమిత్ షా సభ ఎటువైపు దారి తీస్తుందోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు.

దేశ నలుమూల అనేక చోట్ల సీఏఏకు వ్యతిరేకంగా ఉన్నత విద్యాసంస్థల్లో, ప్రముఖ ఐటి రంగ సంస్థల్లో ఉద్యోగులు, సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయేతర రాష్ట్రాలలో ఈ చట్టాన్ని వ్యతిరకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీఏఏను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో కూడా సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలోనూ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 10లక్షల మందితో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామనీ కేసీఆర్ వెల్లడించారు. దీంతో విపక్షాలకు కౌంటర్‌గా సీఏఏకు మద్దతుగా ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మార్చి 15న హైదరాబాద్ నగరంలో సీఏఏకు మద్దతుగా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుడటంతో..ఈ సభ హైదరాబాద్‌లో ఎలాంటి అల్లర్లు సృష్టించబోతుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికీ రాష్ర్టంలో సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఉర్దూ యునివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఢిల్లీలో సీఏఏను వ్యతిరేకిస్తున్న నిరసనకారులపై జరిగిన దాడిలో ఇప్పటికే 39 మంది మృతి చెందారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సీఏఏ‌పై బీజేపీ ఆధ్వర్యంలో సభ నిర్వహణ ఎంత వరకు సబబు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Next Story

Most Viewed