పండుగ తర్వాతే పత్తి కొంటరట!

by  |
పండుగ తర్వాతే పత్తి కొంటరట!
X

దిశ, వేములవాడ: పత్తి రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారుల నుంచి రైతులను కాపాడేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పటికే పల్లెల్లో సగం పత్తి వరకు దళారుల పాలైంది. ఇటీవల ఆగమేఘాల మీద పత్తి కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కానీ, మంచి రోజులు లేవని, దీపావళి పండుగ తర్వాతే కొనుగోలు చేస్తామని రైతులకు నిర్వాహకులు చెప్తున్నారు. పండుగ తర్వాత కొనుగోళ్లు చేస్తే.. హడావుడిగా కేంద్రాలను ఎందుకు ప్రారంభించారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్భాటంగా ప్రారంభం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్, కలెక్టర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆర్భాటంగా ప్రారంభించారు. జిల్లాలోని కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో కావేరి కాటన్ మిల్లు, వేములవాడ మండలం నాంపల్లిలో లక్ష్మీ నరసింహ ఇండస్ట్రీస్, సంకెపల్లిలోని శ్రీలక్ష్మీ ఇండస్ట్రీల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాణ్యమైన పత్తికి కనీస మద్ధతు ధరగా క్వింటాలుకు రూ.5,825లు, గింజ చిన్నగా ఉన్న పత్తికి రూ.5,725లకు కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, రైతులు తీసుకొచ్చిన పత్తిని పండుగ తర్వాత తీసుకురావాలని కేంద్రాల నిర్వాహకులు తిరిగి పంపిస్తున్నారు. దీంతో రైతులు తమకు ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర వస్తుందనే గంపెడు ఆశతో వెళ్లి, నిరాశతో వెనుదిరుగుతున్నారు.

దళారుల పగా..

ఇప్పటికే రైతుల నుంచి దళారులు పత్తి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ. 4 వేల 500లు ధరకు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అదనంగా పత్తి తరుగు పేరిట మరింత మోసాలకు పాల్పడుతున్నారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభించినప్పటికి కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా పండుగతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరపాలని రైతులు వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed