అక్రమ సంబంధానికే భార్య మొగ్గు.. నిజం నిగ్గుతేల్చిన మృతదేహం రంగు..!

by  |
extra-marrital-affair -1
X

దిశ, ఏపీబ్యూరో : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను నాశనం చేస్తున్నాయి. పరాయి స్త్రీ మోజులో పడి భర్త.. పరాయి పురుషుడి మోజులో పడి భార్య ఇలా తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. క్రమేణా ఈ అక్రమ సంబంధాలు ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చింది. పోలీసులు కథనం ప్రకారం.. జె.పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడుకు చెందిన కుంచాల రవి(35)కి అదే గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మితో 12ఏళ్ల కిందట వివాహమైంది. రవి బేల్దారీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రాజ్యలక్ష్మి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న రవి పద్దతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు.

అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పురాకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే తన సుఖానికి అడ్డొస్తున్నడన్న అక్కసుతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజ్యలక్ష్మి నిర్ణయించుకుంది. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన రవికి కూల్‌డ్రింక్‌‌లో విషం కలిపి తాగించగా అతడు చనిపోయాడు. అనంతరం తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. బంధువులు దూర ప్రాంతంలో ఉండటంతో వారి కడచూపు కోసం గురువారం వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. అయితే, రవి మృతదేహం రంగుమారి ఉండటంతో బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మిని విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తమదైన స్టైల్‌లో విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ మేరకు రాజ్యలక్ష్మిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో ఆమె ప్రియుడి ప్రమేయం ఉందా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed