చావు బతుకుల మధ్య పోలీస్.. భిక్షాటన చేస్తోన్న భార్య

by  |
చావు బతుకుల మధ్య పోలీస్.. భిక్షాటన చేస్తోన్న భార్య
X

దిశ, కొత్తగూడ : ఆయనొక ప్రభుత్వ ఉద్యోగి. అనుకోని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతను బతకడం కష్టం అని వైద్యులు చెప్పే సరికి కనపడిన దేవుని ఫొటోకల్లా మొక్కుతూ వేడుకుంది. ఆయన ఆరోగ్యం బాగుండాలని వేములవాడ రాజన్న, బద్ది పొచ్చమ్మకు మొక్కుతూ ఊహించని దీక్ష చేపట్టింది. ప్రతియే ప్రత్యక్ష దైవం అంటూ 101 ఇండ్లలో భిక్షాటన చేసి దర్శనానికి వస్తానని వ్రతం చేపట్టింది. ఈ అనూహ్య సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగారం మండలంలోని తిర్మలగండి గ్రామానికి చెందిన కుంజ లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తె వినోదకు కొత్తగూడెం మండల కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొగ్గం దేవేందర్‎కి కొన్నేళ్ల కిందట వివాహం అయింది. సజావుగా సాగుతున్న వారి వైవాహిక జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకున్నాయి. దేవేందర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆందోళన చెందిన అతని భార్య కనపడిన దేవుళ్లందరికీ తన భర్త ఆరోగ్యం బాగుపడాలని మొక్కింది. రోజులు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో దేవేందర్ బతకడం కష్టం అని వైద్యులు తేల్చేశారు. దీంతో వేములవాడలోని రాజన్న, బద్దిపోచమ్మకు మొక్కులు చెల్లిస్తామని వ్రతం చేపట్టింది. ఇందుకు అనుగుణంగా మండలంలోని 101 ఇండ్లలో భిక్షాటన చేసి వేములవాడకు వచ్చి మొక్కులు అప్పజెప్తానని వేడుకున్నది. డోర్ టు డోర్ తిరుగుతూ ఏ భార్య చేయని సాహసానికి పూనుకుంది. త్వరలోనే మొక్కు చెల్లించడానికి వేములవాడకు వెళ్తానని చెబుతోంది. ఇదిలా ఉండగా దేవేందర్ ఆరోగ్యం ఈ మధ్య కొద్ది కొద్దిగా బాగుపడుతోందని వినోద వెల్లడించింది.


Next Story

Most Viewed