వరల్డ్‌ కప్‌లో ఆడుతానంటే.. ఐపీఎల్‌లోనే వద్దన్నారు..!

by  |
వరల్డ్‌ కప్‌లో ఆడుతానంటే.. ఐపీఎల్‌లోనే వద్దన్నారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: 2013 ఐపీఎల్-6వ సీజన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు పలువురు క్రికెటర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా 2011 ఐసీసీ ప్రపంచకప్‌లో కీలక పాత్ర వహించిన ఆటగాడి స్థానం.. క్రికెట్ రంగంలో అత్యున్నత స్థానంలో ఉంటుదనుకుంటే.. ఐపీఎల్ సీజన్‌-6లో జరిగిన తప్పిదంతో అంధకారంలోకి నెట్టివేసింది. వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రవేసింది. దీంతో భారత జట్టు తరఫున కీలకంగా ఉండాల్సిన అతడు.. ప్రస్తుతం దేశవాలీ క్రికెట్‌లో ఆడేందుకు కూడా అర్హత సాధించలేకపోతున్నాడు. స్వరాష్ట్ర క్రికెట్ క్లబ్‌లో అవకాశం వచ్చినా.. బీసీసీఐ మాత్రం ముందు నుంచి నో ఎంట్రీ బోర్డు వేస్తూనే ఉంది. ప్రత్యర్థులను గడగడలాడించే సత్తా ఉన్నప్పటికీ అతడిపై ఉన్న అపవాదు అన్నింట్లో అడ్డొస్తూనే ఉంది. అయినప్పటికీ తప్పకుండా 2023 వరల్డ్‌ కప్‌లో స్థానం సంపాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఇతడికి.. 2021 ఐపీఎల్‌ వేలం నుంచి బీసీసీఐ తొలగించడం గమనార్హం.‌ అతడు ఎవరో అనుకుంటున్నారా..? అందరికీ సుపరిచితమైన టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్.

2013లో జరిగిన ఘటన గుర్తుందా..

2013లో ఐపీఎల్-6వ సీజన్‌ ప్రారంభమైంది. దేశం మొత్తం ఆటగాళ్లు ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తారో అన్న అంచనాలతో టీవీలకు అత్తుకుపోయారు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌లో‌ భారత్‌ తరఫున నిలబడి సత్తా చాటిన శ్రీశాంత్ బౌలింగ్‌పై కాస్తా ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ సమయంలో శ్రీశాంత్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. భారీ అంచనాల నడుమ ఆ జట్టు ఫ్రాంఛైజర్లు అతడిని కొనుగోళు చేశారు. కానీ, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ఒక్కసారిగా ఆ సీజన్‌లో దుమారం రేపింది.

బౌలర్ శ్రీశాంత్ బుకీలను సంప్రదించాడన్న వార్తలు బీసీసీఐ వర్గాల్లో కలకలం రేపగా.. ఆ అధికారులే ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. దీంతో ఢీల్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే, శ్రీశాంత్ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని బీసీసీఐ ధృవీకరిస్తూనే.. అందుకు శిక్షగా జీవితకాలం నిషేధం విధించింది. అంటే దాదాపు 14 ఏండ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ విభాగంలో నిషేధం ఉంది. దీంతో శ్రీశాంత్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. కుటుంబీకులు మాత్రం కుట్ర చేశారని ఆరోపించారు. తమ కొడుకు అలాంటి వాడు కాదని చెప్పుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, దీనిపై శ్రీశాంత్‌ నుంచి స్పష్టమైన సమాధానం మాత్రం రాలేదు.

ఇక 2013 నిషేధం నుంచి పట్టువదలని శ్రీశాంత్.. భారత్ తరఫున ఆడేందుకు.. బీసీసీఐ అనుమతి కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. ఇక ఇదే సమయంలో స్పాట్ ఫిక్సింగ్‌పై కోర్టు ముందు ఢిల్లీ పోలీసులు సరైన ఆధారాలు చూపలేదని.. కేవలం బుకీలతో సంప్రదింపులు చేసినట్టు ఆధారాలు చూపించారు. దీంతో బీసీసీఐ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు 2013లోనే నిషేధాన్ని 7 ఏండ్లకు కుదించింది. ఈ పరిణామలతో 2020లో నిషేధం పూర్తయింది.

నిషేధం ముగియగానే..

ఇక క్రికెట్‌పై అతడి నిషేధం ముగియగానే శ్రీశాంత్(38) తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.కేరళ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఇదే ఉత్సాహంతో ఉన్న అతడు ఇక ఐపీఎల్‌ 2021లో ఆడేందుకు తన ధరను కూడా నిర్ణయించుకున్నాడు. కనీస ధర రూ. 75 లక్షలుగా నిర్ణయించుకున్నట్టు క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. కానీ, అతడిని వేలం పాట నుంచి తొలగిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. దీంతో అతడి ఆశలపై నీరు చల్లినట్టు అయింది. కానీ, ఈ ఏడాది కాకపోయిన వచ్చే ఏడాది అయినా ఏదో ఒక జట్టులో స్థానం సంపాధిస్తానని శ్రీశాంత్ పట్టుదలతో మాట్లాడాడు.

కానీ, అతడి వయస్సు ప్రస్తుతం 38 సంవత్సరాలు కావడం బలహీనత అంటూ సీనియర్ ఆటగాళ్లు చెబుతున్నారు. దీనిపై కూడా స్పందించిన శ్రీశాంత్.. క్రిస్ గేల్ వంటి ఆటగాడి కోసం ఇప్పుడు అన్ని జట్లు ఎదురుచూస్తున్నాయని.. తాను అదే విధంగా స్థానం సంపాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో ఆడుతానంటున్నా.. ఐపీఎల్‌లోనే అడ్డు చెప్పారని అతడిపైనే విమర్శలు వస్తున్నాయి.



Next Story

Most Viewed