లాభమెవరికి..? నష్టమెందరికి..?

by  |
లాభమెవరికి..? నష్టమెందరికి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పూర్తయ్యింది. పోలింగ్ ముగిసింది. ఈసారి పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఓట్లు పోలయ్యాయి. మూడు డివిజన్లలో మాత్రమే 50 శాతం పోలింగ్ ఉండగా, మిగిలిన చోట్ల 40 శాతం కంటే తక్కువగానే నమోదైంది. ఓటింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లెక్కల్లో మునిగారు. ఒక్కో ఓటును లెక్కించుకుంటూ అంచనా వేస్తున్నారు. ఓటింగ్ శాతం తగ్గడంపై అధికారపార్టీ కుట్ర కోణం ఉందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ మాత్రం ఎక్కడెక్కడ గెలుస్తామనే లెక్కల్లో ఉంది. ప్రచారంలో నగరమంతా ఊగిపోయింది. బీరు, బిర్యానీలతో చిందేశారు. నినాదాలతో ప్రచారపర్వాన్ని హోరెత్తించారు. ఓట్లేసే సమయానికి మాత్రం జారుకున్నారు. పోలింగ్​శాతం దారుణంగా పడిపోయింది. ముందు నుంచీ చాలా ఆశలతో ఉన్న అభ్యర్థులు ఒక్కసారిగా డీలా పడ్డారు. పోలింగ్​శాతం కొంతమేరకే పరిమితం కావడంతో అధికార పార్టీలో ఊపు తెస్తోంది. సొంతంగా మేయర్​ పీఠాన్ని దక్కించుకుంటామనే ధీమా నెలకొంది. ఓటింగ్ శాతం తక్కువ కావడంతో తమకే అనుకూలిస్తుందని అంచనాకు వస్తోంది.

మనదే పీఠం..

అధికార పార్టీ మరోసారి తమదే ఆధిపత్యం అన్నట్టుగా ధీమా కనబర్చుతోంది. ముందుగా కొంతమేరకు కొన్నిసీట్లపై అనుమానాలున్నా… ఓటింగ్ శాతం తగ్గడంతో అనుకూలంగా మారినట్లు పార్టీ వర్గాలు బేరీజు వేసుకుంటున్నాయి. పోలైన ఓట్లలో ఆయా డివిజన్ల వారీగా సంక్షేమ పథకాలు, వరద సాయం పంపిణీ వంటి తాయిలాలు ఓట్లుగా మారాయని భావిస్తోంది. ప్రచారం సందర్భంగా పార్టీ అభ్యర్థుల గెలుపుపై కొంత మేరకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుకున్న దానికంటే తక్కువగా పోల్ కావడం కలిసి వస్తుందనుకుంటున్నారు. దీంతో మేయర్ పీఠం మళ్లీ తమదేనంటున్నారు. అభ్యర్థులు కూడా మేయర్​ పీఠాన్ని దక్కించుకునేందుకు మంత్రి కేటీఆర్​ దగ్గరకు పరుగులు తీస్తున్నారు. రెండో స్థానంలో కొనసాగుతున్న మజ్లిస్ ​హుషారుగా ఉంది. పాత స్థానాలతో పాటు ఇంకా కొన్ని స్థానాలు అదనంగా కలిసి వస్తాయని భావిస్తున్నారు. బయట ప్రాంతాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని లెక్కలేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఓటింగ్ జరిగిందని, తమ అభ్యర్థుల గెలుపునకు ఇబ్బందులేమీ లేదనే భరోసాతో ఉంది.

ప్రచారపర్వంలో హైపిచ్​కు వెళ్లిన బీజేపీ ఒక్కసారిగా సన్నగిల్లింది. ఈస్థాయిలో పోలింగ్​తగ్గుతుందని ఊహించలేదు. బీజేపీ పట్టున్న ప్రాంతాలు, అనుకూలంగా ఉంటుందని ఊహించిన డివిజన్లలో పోలింగ్​పర్సంటేజి గణనీయంగా దిగజారింది. ఈ పరిణామాలు పార్టీ శ్రేణులను కొంత నైరాశ్యంలో పడేశాయి. విజయాలు కొన్ని సీట్లకే పరిమితమవుతాయనే అంచనాల్లో ఉన్నారు. ముందుగా ఉన్న జోష్​తో సుమారు 100 వార్డులను గెలుచుకోవాలని భావించినా… ఇప్పుడు 60 సీట్లు గెలుచుకోవడం ఖాయమనుకుంటున్నారు. ఓటింగ్ సరళిని పరిగణలోకి తీసుకుంటే గ్రేటర్​ పరిధిలో తాము అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తామని ధీమాతో ఉన్నారు. ఓటింగ్ శాతం పెరిగితే తమకు కలిసి వచ్చేదని, మేయర్ పీఠం దక్కేదని ఆశ పెట్టుకున్నారు. కాంగ్రెస్​ పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటి వరకు రెండంకెల స్థానాలను దక్కించుకుంటామని చెప్పుకొచ్చినా… మంగళవారం పోలింగ్​ ముగిసిన తర్వాత టాప్​టెన్​లో ఉంటామా… అనేది సందేహంగా మారింది. మూడు పార్టీలు కలిసి ఓటింగ్​శాతాన్ని తగ్గించాయ ఆ పార్టీ శ్రేణులు ఆరోపణలు సంధిస్తున్నారు. మాట కూడా మాట్లాడం లేదు. మల్కాజిగిరి పరిధిలో కొన్ని సీట్లతోపాటు, మరికొన్నిచోట్ల ఆశలు పెట్టుకున్నారు. ఊహించని పరిణామాలు ఆశల్లేకుండా చేశాయి.

సైలెంట్​పై సైలెంట్​..

బస్తీలు, కాలనీలు, మురికివాడలవారీగా పార్టీలకు అనుకూలంగా ఉండే వర్గాలు, ఓటర్లపై అన్ని పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. కొన్నిచోట్ల తటస్థ ఓట్లు పోలయ్యాయి. వీటిపై రాజకీయ పార్టీలు అంచనాకు రావడం లేదు. పోలింగ్​ శాతం తగ్గినా… సైలెంట్ ఓట్లు నమోదయ్యాయి. తటస్థ ఓట్లు పోలయ్యాయి. వారిని మచ్చిక చేసుకోవడంలో ఏ పార్టీ సక్సెస్​ కాలేదు. అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో దాదాపు అన్ని పార్టీలు గంపగుత్తగా రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఏ మేరకు సక్సెస్​అయ్యాయనే లెక్కలు తేలడం లేదు. ఓటర్లను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేసినా లెక్క చిక్కడం లేదు. ఓటర్లు చీలినట్లుగా వెళ్లినా, ఓటేసేందుకు మాత్రం కచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇది అపార్ట్​మెంట్లలో ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

పోలింగ్​తగ్గినా… ధీమానే

పోలింగ్​శాతం తగ్గినా పార్టీలు మాత్రం ధీమానే వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దాదాపు ఒంటరిగానే మేయర్​ పీఠాన్ని దక్కించుకుంటామని చెబుతోంది. బీజేపీ కూడా మేయర్​స్థానం తమ ఖాతాలోనే ఉంటుందని చెబుతోంది. పొలింగ్ శాతం తగ్గేలా టీఆర్‌ఎస్‌ కుట్రకు పాల్పడిందంటూ కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ నేత డీకే అరుణ తదితరులు ఆరోపించారు. పోలింగ్‌ ముందు నాలుగు రోజులు సెలవులు వచ్చేలా ప్లాన్ చేశారన్నారు. ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎ‌స్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

పోలింగ్ తగ్గడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు లేవన్నారు. అధికార పార్టీ సేవలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరితపించిపోయిందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఆరోపించారు. సీఎం, డీజీపీ, మంత్రి కేటీఆర్, పోలీసులు కలిసి గ్రేటర్​లో మత కల్లోలాలు జరుగుతాయని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు, ప్రభుత్వం పౌరులను భయానికి గురి చేయడంతోనే పోలింగ్​కు రాలేదన్నారు. పోలింగ్​36 శాతం అయ్యిందని ప్రాథమికంగా చెపుతున్నారని, ఒకటి, రెండు శాతం పెరగొచ్చు కానీ ఎక్కువ పెరిగితే అది అధికార పార్టీ రిగ్గింగ్​గానే భావించాల్సి వస్తుందని శ్రవణ్, మధుయాష్కి అన్నారు.


Next Story

Most Viewed