దినసరి కూలీలకు దిక్కెవరు !

by  |
దినసరి కూలీలకు దిక్కెవరు !
X

దిశ, మేడ్చల్: రాష్ట్రంలో బాగా పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతాల్లో మేడ్చల్ ఒకటి. ఇక్కడకి మన తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు అధికంగా వలస వస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో దినసరి కార్మికుల జీవన స్థితి కష్టంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న సేవలేవీ వీళ్లకు అందకపోవడం గమనార్హం.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నాలుగు పైసలు సంపాదించుకుని ఇంటికి వెళితే కన్నొళ్లకు బుక్కెడు బువ్వ పెట్టొచ్చనే ఆలోచనతో వారు కరోనా పుణ్యంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు ఏవీ నడకపోవడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడే మగ్గిపోతున్నారు. నిత్యావసర సరుకులు అందుబాటులో లేకపోవడం, దొరికే వాటికి అధిక ధరలు ఉండటంతో రోజుకు ఒక్కపూటే తింటున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆశ్రయ కేంద్రాల ద్వారా భోజనం పెడుతున్నామని చెబుతున్నా వీరికి మాత్రం అందడం లేదు.

మేడ్చల్ జిల్లా పరిధిలో దాదాపు 30వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా తెలంగాణతో పాటు రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర‌ప్రదేశ్‌ వాసులు. వీరిని ఆయా కంపెనీల్లో పనిచేయించేందుకు లేబర్ కాంట్రాక్టర్లు అక్కడి నుంచి తీసుకొస్తుంటారు. పనిచేయించుకున్నాక స్వస్థలాలకు పంపే విషయం వచ్చేసరికి చేతులెత్తేశారు. బాలానగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌లో కంపెనీలు ఎక్కువగా ఉండటంతో అక్కడే మురికివాడలు, ఇరుకు సందుల్లోని ఇళ్లలో కిరాయికి తీసుకొని కాలం వెల్లదీస్తున్నారు.

ప్రభుత్వం సేవలన్నీ ఉన్నోళ్లకే..

లాక్‌డౌన్ నేపథ్యంలో సేవలన్నీ ఇంటికి చేరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆన్‌లైన్ సంస్థల ద్వారా పాలు, కూరగాయలు చేరుస్తామని అంటున్నారు. అయితే మురికి వాడల్లో నివసిస్తూ కంపెనీల్లో పనులు చేసిన వారు తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మొదట్నుంచి నగర నిర్మాణంలో ఎంతో కీలకమైన కార్మికులను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చూడకపోవడం శోచనీయం.

Tags: corona virus, workers, industry, lockdown, meals, vegetables, dirt, residential, medchal, contractors

Next Story

Most Viewed