ఐపీఎల్-2021 స్పాన్సర్ ఎవరు?

by  |
ఐపీఎల్-2021 స్పాన్సర్ ఎవరు?
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కాలంలో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను విదేశీ గడ్డపై నిర్వహించి బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు కరోనా, మరోవైపు టైటిల్ స్పాన్సర్ వీవో తప్పుకోవడం వంటి ప్రతికూల పరిస్థితుల నడుమ అప్పటికప్పుడు ‘డ్రీమ్ 11’ను స్పాన్సర్‌గా తీసుకొచ్చి ఐపీఎల్‌ను విజయవంతం చేసింది. కాగా, డ్రీమ్ ఎలెవెన్ సంస్థ ఐపీఎల్‌తో కేవలం ఒక ఏడాది మాత్రమే ఒప్పందం కుదుర్చకున్నది. గతంలో వీవో ఏడాదికి రూ. 440 కోట్ల వరకు చెల్లిస్తుండగా.. డ్రీమ్ ఎలెవెన్ కేవలం రూ. 222 కోట్లకు ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వీవోతో ఉన్న ఒప్పందాన్ని మాత్రం గత ఏడాది రద్దు చేయకుండా తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించింది. ఫిబ్రవరి 18న చెన్నైలో ఐపీఎల్ మినీ వేలం జరగనున్నది. ఈ సమయంలో మరోసారి ఐపీఎల్ స్పాన్సర్‌ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది.

డ్రీమ్ ఎలెవెన్ ఔట్..

గత ఏడాది ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా కంపెనీలపై తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటున్న వీవోను తప్పించాలని దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో కూడా చైనా కంపెనీ వీవోను తప్పించాలని ఉద్యమం లేవదీశాలు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించిన బీసీసీఐ.. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి వీవోను తాత్కాలికంగా తప్పించింది. అదే సమయంలో కరోనా లాక్‌డౌన్ మొదలవడంతో యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌కు స్పాన్సర్ కరువయ్యారు. చివరి నిమిషంలో ఫాంటసీ లీగ్ సంస్థ ‘డ్రీమ్ 11’తో టైటిల్ స్పాన్సర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో వీవో ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లిస్తుండగా.. డ్రీమ్ 11తో మాత్రం కేవలం రూ. 222 కోట్ల ఒప్పందం చేసుకున్నది. ఒప్పందం సమయంలోనే కేవలం 13వ సీజన్ (ఐపీఎల్ 2020) వరకు మాత్రమే అని బీసీసీఐ, డ్రీమ్ 11 నిబంధన రాసుకున్నాయి. ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ 31తో ముగిసింది. జనవరి 20న జరిగిన ఐపీఎల్ రిటెన్షన్ సమయంలో కూడా టైటిల్ స్పాన్సర్‌ను ప్రస్తావించకుండానే స్టార్ స్పోర్ట్స్ ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు?

యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ కోసం హడావిడిగా ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. అంతకు ముందు కంటే రూ. 218 కోట్లు తక్కువకే ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం గత డిసెంబర్ 31తో ముగిసిపోవడంతో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. ఐపీఎల్-14వ సీజన్‌కు ఇంకా మూడు నెలలు సమయం ఉండటంతో మంచి ధర ఇచ్చే స్పాన్సర్‌ను వెతకాలని బీసీసీఐ అనుకుంటున్నది. దీనికి సంబంధించిన టెండర్లు త్వరలోనే పిలవనున్నట్లు ఒక బీసీసీఐ అధికారి ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ అనే వెబ్‌సైట్‌కు చెప్పారు. దీంతో ఫిబ్రవరి 18న నిర్వహించనున్న ఐపీఎల్ మినీ వేలం కేవలం ఐపీఎల్ లోగోతోనే సాగుతుందని.. ఆ కార్యక్రమంలో స్పాన్సర్ లోగోలు ప్రదర్శించే అవకాశం లేదని చెప్పారు. అయితే కొత్త స్పాన్సర్ టెండర్లు ఈ ఒక్క ఏడాదికే పిలుస్తారా లేదా గతంలో లాగా ఐదేండ్లకు పిలుస్తారా అనేది సందిగ్దంగా మారింది. 2022లో ఐపీఎల్‌లో ఉన్న అన్ని ఒప్పందాలు రద్దు కానున్నాయి. ఫ్రాంచైజీలతో ఆటగాళ్ల ఒప్పందం, స్టార్ టీవీతో ఉన్న బ్రాడ్‌కాస్ట్ మరియు ప్రొడక్షన్ ఒప్పందం, ఇంటర్నెట్ ఒప్పందాలు ముగియనున్నాయి. 2022లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలు కూడా రాబోతున్నాయి. దీంతో టైటిల్ స్పాన్సర్‌ను కేవలం ఈ ఒక్క ఏడాదికే పరిమితం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో పూర్తిగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది.



Next Story

Most Viewed