ఈటల కేసులో దోషులెవరు..?

by  |
ఈటల కేసులో దోషులెవరు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి ఈటల అసైన్డ్‌మెంట్​భూములను కొనుగోలు చేశారని, కబ్జా చేశారని అన్న వార్త సంచలనం సృష్టించింది. కానీ అసైన్డ్​భూములను కొనుగోలు చేశారని అధికారులకు ముందే తెలుసునని ఒప్పుకున్నారు. ఆనాడు చర్యలు తీసుకోకుండా ఇప్పుడెందుకు వెలుగులోకి తీసుకున్నారన్న అంశంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. మంత్రి తమకు ఫోన్లు చేసి కొనుగోలు చేసిన అసైన్డ్​భూములను రెగ్యులరైజ్​చేయాలని కోరినట్లు రిటైర్డ్​కలెక్టర్​ధర్మారెడ్డి, రిటైర్డ్​అదనపు కలెక్టర్​నగేష్​లు మీడియాకు వివరించారు. చాలా కాలం క్రితమే మంత్రి ఈటల తాను అసైన్డ్​భూములను కొనుగోలు చేశానని వారికి చెప్పినట్లు తెలిపారు. అప్పుడే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి చేసిన పొరపాటును ప్రభుత్వం దృష్టి తీసుకురాలేదు. వెంటనే పీఓటీ చట్టం కింద వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యతను ఆ ఇద్దరు అధికారులు విస్మరించారని రెవెన్యూ చట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ అసైన్డ్​ల్యాండ్​ప్రొహిబిషన్​ఆఫ్​ట్రాన్సఫర్​యాక్ట్​1977 ప్రకారం ఎవరైనా అసైన్డ్​భూములను కొనుగోలు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి.

సెక్షన్​4 ప్రకారం సివిల్​యాక్షన్, సెక్షన్​7 ప్రకారం క్రిమినల్ యాక్షన్​తీసుకోవాలని సూచిస్తోంది. సివిల్​చర్యల్లో భాగంగా భూమిని కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకోవాలి. అలా కాదని మళ్లీ అదే భూమిపైకి వస్తే క్రిమినల్​చర్యలు కూడా తీసుకునే వీలుంది. అలాగే భూమిని కొనుగోలు చేసిన వారిపై నేరుగా క్రిమినల్​చర్యలకు అవకాశం ఉంది. తహశీల్దార్​నుంచి కలెక్టర్​స్ధాయి అధికారి వరకు సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే సుమోటోగా కూడా చర్యలకు అధికారులకు అధికారం ఉంది. వైఎస్​రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్న కాలంలోనూ ఇదే వివాదం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో 90 రోజుల గడువు ఇచ్చి అసైన్డ్‌మెంట్​భూములను ఆక్రమించుకున్న వారు, కొనుగోలు చేసిన వారు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డినెన్స్​తీసుకొచ్చిన విషయం రెవెన్యూ వర్గాలకు తెలుసు. వైఎస్​రాజశేఖర్ రెడ్డి కూడా తన ఆధీనంలోని వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వపరం చేయడం, అదే భూమిలో పలు విద్యా సంస్థలను నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా మంత్రి ఈటల కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాల కోసం లేదా రీ అసైన్డ్‌మెంట్​చేయాల్సిన బాధ్యతను సదరు అధికారులు విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నైతిక బాధ్యత..

ఉన్నత స్థాయిలోని వ్యక్తులు పేదల నుంచి అసైన్డ్‌మెంట్​భూములను కొనుగోలు చేశారని వారే అంగీకరించినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత అధికారులపై ఉంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులదేనని రెవెన్యూ చట్టాల నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. చట్టం ప్రకారం ఆర్నెళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. కానీ ఇంత కాలం వారెందుకు మౌనం వహించారన్నది అనుమానంగా ఉందన్నారు. పీఓటీని అమలు చేసి ఉంటే ఇప్పుడీ సమస్య తలెత్తేది కాదన్నారు. హఠాత్తుగా ఈ భూ వివాదం తెర మీదికి రావడం రాజకీయ కుట్రగా భావిస్తున్నారు. ఐతే కొన్ని వివాదాస్పద భూముల్లో ఇరుక్కున్న అధికారులను తప్పించేందుకు వ్యూహరచన ఏమైనా జరిగిందా అన్న చర్చ నడుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​జిల్లాల చుట్టూ వేలాది ఎకరాల అసైన్డ్ భూముల కబ్జాకు గురయ్యాయి. చేతులు మారాయి. కొన్ని మ్యుటేషన్లు కూడా జరిగాయి. కానీ మాసాయిపేట విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది.

దర్యాప్తునకు ఆదేశం..

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Next Story

Most Viewed