కరోనా ఆఖరి మహమ్మారి కాదు : డబ్ల్యూహెచ్‌వో

by  |
కరోనా ఆఖరి మహమ్మారి కాదు : డబ్ల్యూహెచ్‌వో
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు సంక్షోభం బారిన పడ్డాయి. కరోనా వైరస్‌ను నిలువరించేందుకు అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే, కరోనా వైరస్ లాంటి మహమ్మారి ఇది చివరిదేమీ కాదని, భవిష్యత్తులోనూ ఇలాంటి మహమ్మారులు మానవ జీవితంలో ఎదురవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. లక్షల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకునే ఇలాంటి వైరస్‌లు, మహమ్మారి విజృంభణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మానవ జీవితంలో ఇలాంటి వాటిని ఎదుర్కోవడం తప్పదని చరిత్ర చెబుతోందని డబ్ల్యూహెచ్‌వో (WHO)చీఫ్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, దీనికోసం ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై భారీగా ఖర్చులను చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఏదైనా ఒక్క దేశం వ్యాక్సిన్ పంపిణీ చేసినంత మాత్రమే మహమ్మారిని నిలువరించలేమని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అనుసంధానంగా ఉండి, తక్కువ ఆదాయం ఉన్న దేశాల ప్రజలకు వ్యాక్సిన్ అందించకపోతే, వైరస్ మరింత ఎక్కువగా విస్తరించే ప్రమాదముందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. దీనికోసం కరోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలకు సమానగా అందించేందుకు కోవ్యాక్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు, దీని ద్వారా వ్యాక్సిన్‌ను తయారు చేసుకోలేని సుమారు 100 దిగువ, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్ (Vaccine) అందించే ప్రయత్నాలను చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ కార్యక్రమంలో భారత్‌ను భాగస్వామిగా చేర్చుకోనున్నట్టు పేర్కొంది.



Next Story

Most Viewed