కొత్త ఆలోచనలకు తెరలేపారు.. ప్రస్తుతం వారిద్దరి నోట ఒకే మాట

by  |
కొత్త ఆలోచనలకు తెరలేపారు.. ప్రస్తుతం వారిద్దరి నోట ఒకే మాట
X

దిశ, కరీంనగర్: చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు దశాబ్దం క్రితం అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అప్పటి నుంచి పనుల్లో పురోగతి లేకపోవడంతో రైతాంగం ఆ ప్రాజెక్టుపై ఆశలు వదిలేసుకుంది. ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాథుడే లేకపోవడంతో గోదారి చెంతనే ఉన్నా బోరు బావులతోనే అన్నదాతలు సేద్యం చేస్తున్నారు. ఈ తరుణంలో కొత్త ఆలోచనలకు తెరలేపారా ఇద్దరు నాయకులు. ఈ పథకం గురించి మంథని నియోజకవర్గానికి చెందిన నాయకులిద్దరూ ఒకేసారి రంగంలోకి దిగి రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. భూపాలపల్లి జిల్లా బీరసాగర్ వద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పనులు నత్తలకే నడకలు నేర్పుతున్నాయని చెప్పాలి. మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 40 వేల ఎకరాలకు సాగు నీరిందించేందుకు ఈ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పరణ చేసింది. దీంతో చిన్నతరహా ఎత్తిపోతల ప్రాజెక్టు తెరమరుగై పోయింది. అయితే హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పుట్ట మధు ఈ లిఫ్ట్ నిర్మాణం చేపట్టాలని కోరడంతో ఆయన చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే తాజాగా మంథనికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇద్దరూ కూడా ప్రాజెక్టు గురించి మాట్లాడుతుండడం విశేషం.

పనులు వేగవంతం చేయాలని వినతి

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చిన్నకాళేశ్వరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను రెండు రోజుల క్రితం కలిసి కోరారు. 40 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించాలని వినతిపత్రం ఇచ్చారు. మంథనిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఇంజనీరింగ్ అధికారులు, మహదేవపూర్ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం, రీ-డిజైన్ తదితరాలపై ఆయన రివ్యూ చేశారు. అన్నారం, సూరారంలతోపాటు సమీప గ్రామాలకు చిన్నకాళేశ్వరం నీరందించే విధంగా లింక్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇద్దరు నాయకులూ ఉన్నపళంగా చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం ఏమిటా అని సామాన్య రైతులు ఆలోచిస్తున్నారు. పుష్కర కాలం తరువాత అధికార, ప్రతిపక్ష నాయకుల నోట ఒకే నినాదం వెలువడినందున వెంటనే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed