ధాన్యం కొనుగోళ్లపై ద్విముఖ వ్యూహం..?

by  |
ధాన్యం కొనుగోళ్లపై ద్విముఖ వ్యూహం..?
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి మార్కెటింగ్, సివిల్ స‌ప్లై శాఖలు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం ప్ర‌భుత్వం కొనొచ్చు.. కొన‌క‌పోవ‌చ్చు రెండింటికీ సిద్ధప‌డి ఉండాలంటూ ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల‌కు ఇటీవ‌ల మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వ‌హ‌ణ‌కు సానుకూల స‌న్న‌ద్ధ‌త‌పై దృష్టి సారిస్తున్నారు. సివిల్ స‌ప్లై శాఖ అధికారులు ఇప్ప‌టికే గ‌న్నీ బ్యాగుల ఇండెంట్‌ను సిద్ధం చేసి పంపారు. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తూ ధాన్యాన్ని మార్కెట్ల‌లోనే కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఓ వైపు ఢిల్లీలో రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో పెద్ద ఉద్య‌మ‌మే న‌డుస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆచీతూచి అడుగులు వేస్తున్న‌ట్లు శాఖ‌ల స‌న్న‌ద్ధ‌త‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌కుంటే రాష్ట్రంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న సెగ‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నే దురాలోచ‌న‌తోనే వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్‌, సివిల్ స‌ప్లై శాఖ అధికారుల‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

5ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా సాగు..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో యాసంగిలో దాదాపు 5ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా ఎక‌రాల్లో వ‌రి ధాన్యం సాగ‌వుతోంద‌ని వ్య‌వ‌సాయ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. దాదాపు 12.5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి వ‌స్తుంద‌ని మార్కెటింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. గ‌తంలో మాదిరిగా కొనుగోళ్లు చేట్టాల‌ని భావిస్తే దాదాపు 80 ల‌క్షల గ‌న్నీ బ్యాగులు అవ‌స‌ర‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. గ‌తంలో సివిల్ స‌ప్ల‌య్ శాఖ నేతృత్వంలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోఇందిరా క్రాంతి ప‌థం, (సింగిల్ విండో) ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాల ఆధ్వ‌ ర్యంలో ప్ర‌భుత్వం సుమారు 600ల‌కు పైగా కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. అయితే తాజా పరిస్థితుల్లో కొనుగోళ్ల ప్ర‌క్రియ‌పై ప్ర‌తిష్ఠంభ‌న నెల‌కొంది. అయితే కొనుగోలు కేంద్రాల సంఖ్య‌ ప‌రిమితంగా నిర్వ‌ హిస్తూ కొనుగోళ్లు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Next Story

Most Viewed