టీమిండియాపై దెబ్బపడింది.. తిరిగి దాడి చేస్తారా?

by  |
టీమిండియాపై దెబ్బపడింది.. తిరిగి దాడి చేస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌ గడ్డపై సత్తా చాటి వచ్చిన టీమిండియా జట్టుకు స్వదేశీ గడ్డపై పరాభవం ఎదురైంది. సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌ జట్టును ఎదుర్కొలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు షాబాజ్ నదీమ్ స్థానంలో కుల్దీప్‌ను తీసుకోకపోవడం జట్టుకు మైనస్ పాయింట్‌ అంటూ అభిమానులు సైతం తప్పుబట్టారు. ఆస్ట్రేలియాతో ధీటుగా తలపడిన ఆటగాళ్లే ఇంగ్లాండ్‌ జట్టుతో పోరాటం చేసినప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి కీలక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారని మండిపడుతున్నారు. ఇక రెండో టెస్టులో ఏం జరగనుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మొదటి టెస్టు‌లో జరిగిందే ఇదే..

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.. ఆ తర్వాత రూట్(218) డబుల్ సెంచరీకి.. సిబ్లే (87), స్టోక్స్‌ (82) పరుగులకు మిగతా బ్యాట్స్‌మెన్లు తమ వంతు సహకారం అందించి ఎట్టకేలకు 578 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

ఇక ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ కోహ్లీ సైతం 11 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇటువంటి సమయంలో జట్టు భారాన్ని మీదేసుకున్న పుజార (73), రిషబ్ పంత్ (91), వాషింగ్టన్ సుందర్ 85 నాటౌట్‌గా నిలబడ్డాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు అంతగా ఆకట్టుకోకపోవడంతో టీమిండియా 337 పరుగులకు కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో విఫలమైన బౌలర్లు రెండో మ్యాచ్‌లో 178 పరుగులకే రూట్‌ సేనను కుప్పకూల్చారు. విజయానికి మరో అవకాశం వచ్చిందని జట్టు సభ్యులు భావించినప్పటికీ.. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోయారు. సెకండ్ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మను 12 పరుగులకే కట్టడి చేయగా.. శుబ్‌మన్‌ గిల్ (50), విరాట్ కోహ్లీ (72) పరుగుల మెరుగైన ప్రదర్శన చేశారు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాట్స్‌మెన్లు తడబడడంతో టీమిండియా 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

రెండో టెస్టులో ఏం జరగనుంది..

మొదటి టెస్టులో ఇండియా ఓటమితో అభిమానులు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. రెండో టెస్టులో ఏం చేస్తారో అన్న సందేహం వారిలో నెలకొంది. పలువురు ఆటగాళ్లు అనుకున్నంత స్థాయిలో రాణించలేదని బహిరంగ విమర్శలు చేస్తున్నప్పటికీ.. సేమ్ జట్టుతో రెండో టెస్టు కొనసాగించాలని టీమిండియా భావిస్తున్నట్టు సమాచారం. నదీమ్ స్థానంలో కుల్దీప్‌ను తీసుకోవాలని డిమాండ్స్ వినిపించినప్పటికీ.. దానిపై కెప్టెన్ కోహ్లీ కూడా స్పష్టతనిచ్చాడు. జట్టు బౌలింగ్‌లో వైవిధ్యం ఉండటం కోసమే కుల్దీప్‌ను తీసుకోలేదని స్పష్టం చేస్తూనే.. ఓటమికి తన నాయకత్వం కూడా ఓ కారణమని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం రెండో మ్యాచ్‌పై మరింత దృష్టి సారించాల్సి ఉందని స్పష్టం చేశాడు.

అయితే, టీమిండియాపై మొదటి టెస్టు విజయంతో జోరు మీద ఉన్న రూట్ సేన అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తోంది. సిరీస్‌ను క్లీన్‌ స్వీప్ చేస్తే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ వరల్డ్ నెంబర్‌ 1 ర్యాంక్ తమకే చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి పరిణామాలతో రెండో టెస్టు మ్యాచ్‌ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు చెన్నైలోని, చిదంబరం స్టేడియంలోనే నిర్వహించనున్నారు. రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంక్‌ ఆశలు పదిలంగానే ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed