మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఇద్దరు మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-16 11:44:46  IST  )

మహారాష్ట్రలో కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచి మహారాష్ట్రలో (Maharasta) కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబైలోని రైల్వే ట్రాకులు, ఎయిర్‌పోర్టు రన్‌వేలపై భారీగా వరద నీరు నిలిచిపోవటంతో పలు రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రత్నగిరి, రాయ్‌గడ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేశారు. ముంబైలోని విఖ్రోలి పార్క్‌సైట్‌లోని వర్ష నగర్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకి వెళ్లకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, మరో రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Next Story