పాలమూరు డీసీసీబీని పటిష్టం చేస్తాం

by  |
Agriculture Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు డీసీసీబీని పటిష్టం చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ అభివృద్ధి అంశంపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయప సమీక్షా సమావేశం నిర్వహించారు. సహకార సంఘం శాఖలోని ఉద్యోగుల పనితీరులో నాణ్యత పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

బ్యాంక్ రుణాల రికవరీకి డీసీసీబీ డైరెక్టర్లంతా సహకరిస్తే మరింత సాయం అందించేందుకు టెస్కాబ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రుణాల వసూలుకు డీసీసీబీ డైరెక్టర్లు, సీఈఓలకు సూచనలను, సలహాలను మంతి నిరంజన్ రెడ్డి అందించారు. సబ్సిడీ రుణాలు, సబ్సిడీ పథకాలు ఆయా బ్రాంచ్ లు, సొసైటీల పరిధిలోని రైతాంగానికి తెలిసేలా చర్యలు తీసుకుని వారికి మేలు చేకూరేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రుణాలు ఇవ్వడమే కాకుండా వాటిని సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటేనే సహకార సంఘాలకు లాభం చేకూరుతుందన్నారు.

డీసీసీబీ చైర్మన్లు, డైరెక్టర్లు, సహకార సంఘాల చైర్మన్లు , డైరెక్టర్లు క్రియాశీలకంగా పనిచేస్తేనే సహకార సంఘాలు పటిష్టమవుతాయని సూచించారు. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం ఆడిట్లు సమయానుసారంగా నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి పాలమూరులోని 77 సహకార సంఘాలను బలపరిచి పటిష్టం చేయాలని అధికారులను డీసీసీబీ డైరెక్టర్లు ఆదేశించారు. డైరెక్టర్లు, చైర్మన్ , వైస్ చైర్మన్ కలిసికట్టుగా పనిచేసి ప్రణాళికాబద్దంగా ముందుకుసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు , ఎండీ మురళీధర్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుమిత్ర, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, సీఈఓ ప్రకాష్ , వైస్ చైర్మన్ వెంకటయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed