‘రామప్పను గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం’

by  |
uppala srinivas gupta
X

దిశ, గజ్వేల్: “రామప్ప” ప్రాచీన కట్టడాలకు ప్రపంచ ఖ్యాతి దక్కడం తెలంగాణ ప్రజల అదృష్టమని, అయితే రామప్ప క్షేత్రాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ప్రసిద్ధ మర్కుక్ మడలంలోని పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ క్షేత్రంలో నిర్వహించిన మహా పూర్ణాహుతి లో పాల్గొని ఆయన మాట్లాడారు. పర్యాటక రంగానికి సర్కార్ పెద్దపీట వేస్తూ ఉండగా, తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రిని తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ రూ 1200 కోట్లు వెచ్చించి గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రాచీన దేవాలయాలకు సర్కార్ ప్రాధాన్యతనిస్తూ భద్రాద్రి, వేములవాడ, కొమురవెల్లి, నాచగిరి తదితర ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ramappa

ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, అటవీ ప్రాంతాలు, రిజర్వాయర్ల వద్ద టూరిజం స్పాట్ లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుండగా, అడిగినన్ని నిధులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత పాలకుల కాలంలో ఆలయాలు నిర్వీర్యం కాగా టిఆర్ఎస్ సర్కార్ అధికారం చేపట్టిన వెంటనే వాటికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దూప దీప నైవేద్యం కింద నైవేద్యం పథకం కింద 3648 ఆలయాలకు నిధులు కేటాయిస్తుండగా మరో 3000 పురాతన ఆలయాలకు అర్చక ఉద్యోగులను నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. ఎంతో దైవభక్తి కలిగిన సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ ఆ ప్రాంతాలలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్ర చైర్మన్, శ్రీ సీతారామాంజనేయ ఆలయ బాధ్యులు హరి పంతులు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త, ఎంపీపీ అధ్యక్షులు పాండు గౌడ్, ఆలయ నిర్వాహకులు శ్యాంసుందర్ గుప్త, వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, నేతలు ఉప్పల మెట్టయ్య గుప్త, నంగునూరు సత్యనారాయణ గుప్త, ఎన్ సీ. సంతోష్ గుప్త, సంపత్, భిక్షపతి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed