మిస్ యూ ‘మసాలా తాత’

by  |
మిస్ యూ ‘మసాలా తాత’
X

దిశ, వెబ్‌డెస్క్: నైంటీస్ కిడ్స్‌కు బాగా తెలిసిన నోస్టాల్జిక్ వాణిజ్య ప్రకటనల్లో ఎండీహెచ్ మసాలాల ప్రకటన ఒకటి. అందులో ఎరుపు రంగు తలపాగా వేసుకుని కనిపించే తాతను ముద్దుగా ‘మసాలా తాత’ అని కూడా పిలుచుకుంటారు. మసాలాల మహారాజు అని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆ తాతయ్య డిసెంబర్ 3, గురువారం నాడు గుండెపోటుతో మరణించారు. 97 ఏళ్ల వయస్సు వరకు తన మసాలా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉంటూ అటు వ్యాపారం, ఇటు సమాజ సేవ చేస్తూ ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన పేరు ‘మహాశయ్ ధర్మపాల్ గులాటి’. 1923, మార్చి 27న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సియాల్‌కోట్‌లో జన్మించారు. తర్వాత దేశ విభజన సమయంలో వారి కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. అప్పటికే ఆయన తండ్రి మహాశయ్ చున్నీ లాల్ గులాటి ‘మహాశియన్ ది హట్టీ (ఎండీహెచ్)’ పేరుతో మసాలాల దుకాణం నడిపేవారు. కానీ దేశ విభజన తర్వాత అన్నీ వదులుకొని రావడంతో పేదరికంలో పడ్డారు.

దాన్ని గట్టెక్కడానికి ధర్మపాల్ గులాటి చేయని పని లేదు. చెక్క పని నుంచి సబ్బు ఫ్యాక్టరీలు, బియ్యం ఫ్యాక్టరీల వరకు అన్నింటిలో పనిచేశారు. కానీ ఎందులోనూ సంతృప్తి గానీ, డబ్బు గానీ దొరకలేదు. దీంతో 1948, అక్టోబర్ 10న తాను నడుపుతున్న టాంగాను తాకట్టు పెట్టి, ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో అజ్మల్ ఖాన్ రోడ్ వద్ద మసాలాల దుకాణం పెట్టారు. అది కాస్త బాగా పాపులరై పెద్ద వ్యాపారంగా ఎదిగింది. 2017లో భారతదేశంలోనే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్‌ అత్యధిక జీతం పొందుతున్న సీఈవోగా గులాటి రికార్డుకెక్కారు. అంతేకాకుండా 2019లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.

ఇటీవల కరోనా వైరస్ పాండమిక్ సమయంలో కూడా ఢిల్లీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బు విరాళంగా ఇచ్చి, పీపీఈ కిట్లను కూడా దానం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన బాగా పాపులర్ అవడానికి కారణం మాత్రం ఎండీహెచ్ ప్రకటనలే అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో ఆయనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి, ఆయనే స్వయంగా నటించేవారు. ఇలా ఎందుకు అని ఎవరైనా అడిగితే.. నా కష్టాన్ని నేను ప్రమోట్ చేసుకోవడానికి వేరెవరో సెలెబ్రిటీ ఎందుకని ఆయన తిరిగి ప్రశ్నించేవాడు. కష్టపడి పైకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచి, అందరి జీవితాలకు మసాలాతో పాటు వినోదాన్ని కూడా జోడించిన మసాలా తాతయ్య.. వియ్ మిస్ యూ!



Next Story

Most Viewed