మేము సిద్ధం, మీరు సిద్ధమా? బీజేపీకి, టీఆర్ఎస్ సవాల్

by  |
kale-yaday
X

దిశ, శంకర్‌పల్లి: బండి సంజయ్‌గారు మీరు పాదయాత్ర చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. అనవసరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తే మాత్రం సహించమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నిప్పులు చెరిగారు. గురువారం శంకర్‌పల్లిలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం నీకు తగునా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నాయకులకు కనబడటం లేదా? దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుంటే, బీజేపీ నాయకులు కళ్లుండి కూడా చూడలేని కబోదుల్లా విమర్శలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలతో పాటు ఆరోగ్యశ్రీలో కరోనా మహమ్మారిని చేర్చడం వంటి పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.

భారతదేశంలో దళితుల కోసం ఒక్క పథకం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో దళితుల కోసం, దళిత బంధు పథకాన్ని అమలు చేస్తుంటే దానిపై కూడా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సదా విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed