ప్రభుత్వం అమలు చేయని కేజీ టు పీజీ తాము అందిస్తున్నాం..

by  |
ప్రభుత్వం అమలు చేయని కేజీ టు పీజీ తాము అందిస్తున్నాం..
X

దిశ, చార్మినార్​ : ప్రభుత్వం అమలుపరచని కేజీ టు పీజి ఉచిత విద్యను సాలారేమిల్లత్​ ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో బండ్లగూడ సెంటర్​లో తాము అందిస్తున్నట్లు ట్రస్ట్​ చైర్మన్​, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ చెప్పారు. పాతబస్తీలో వేలాదిమంది విద్యార్థులకు ట్రస్ట్​ ద్వారా ఉచిత విద్యనందిస్తున్నామన్నారు. గురువారం ఆయన బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కేజీ టు పీజీ సెంటర్​లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సుమారు 90 ప్రయివేట్​ పాఠశాలలకు చెందిన 500 మంది ఉపాధ్యాయులకు రూ.15లక్షల నగదుతో పాటు రేషన్​ కిట్​లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, నిండు దీవెనలతోనే బతికానని, ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కరోనా విపత్కర సమయంలో కూడా తమ ట్రస్ట్​ ద్వారా కోట్లాదిరూపాయాలతో సేవాకార్యక్రమాలు చేపట్టామన్నారు.

గత రెండేళ్లలోనే నిరుపేదలకు రూ.12కోట్లతో నిత్యావసరసరుకులతో పాటు నగదు సహాయం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా చితికిలపడిపోయిన ప్రయివేట్​ టీచర్లను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా సాయం పొందని వారుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు. చాంద్రాయణగుట్టలో ముస్లింలను విద్యా వంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్క ముస్లిం ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు ఖురాన్​ పఠనం తప్పకుండా చేయడం అలవరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏతేమాద్​ ఉర్దూ పత్రిక ప్రతినిధి అజీజ్​, నసీర్​, ట్రస్టీ డైరెక్టర్​ ​ నూరుద్దీన్​ ఓవైసీ, కార్పొరేటర్లు సలీం బేగ్​, ఫహద్​ బిన్​ అబ్దాద్​, అబ్దుల్​ వాహెబ్​, రహమాన్​, అజం షరీఫ్​, షబానా, హఫీజ్​ పటేల్​, మాజీ కార్పొరేటర్​ సమద్​బిఇన్​ అబ్దాద్​ తదితరులు పాల్గొన్నారు.


Next Story