మేయర్‌గా టీడీపీకి రూ.22కోట్లకు అమ్ముడుపోయావా?

by  |
anil
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా అన్న రీతిలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అభ్యర్థులను రూ.50 లక్షలకు వైసీపీ కొనుగోలు చేసిందని ఆరోపిస్తున్న మాజీ మేయర్ అబ్ధుల్ అజీజ్.. గతంలో టీడీపీకి ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని నిలదీశారు.

నాడు మాజీమంత్రి నారాయణకు రూ.22కోట్లకు అమ్ముడుపోయారా అని ప్రశ్నించారు. రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులు వైసీపీకి అమ్ముడుపోయారనే ఆరోపణలు చేస్తున్న నువ్వు గతంలో ఎంతకు అమ్ముడు పోయావో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అబ్దుల్ అజీజ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.

కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులు 50లక్షలకు అమ్ముడుపోయారని మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శలు గుప్పిస్తున్నారని.. గురువింద సామెత లాగా ముందు ఆయన కింద నలుపు మాత్రం కనిపించడం లేదని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఆర్థిక బలవంతుడు మాజీ మంత్రి నారాయణకు అబ్దుల్ అజీజ్ నాడు అమ్ముడుపోలేదా అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.



Next Story

Most Viewed