రూ.5వేలు ఇస్తేనే పనిచేస్తా… ఫోన్‌లో లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఆడియో వైరల్

by  |
రూ.5వేలు ఇస్తేనే పనిచేస్తా…  ఫోన్‌లో లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఆడియో వైరల్
X

దిశ, ఏపీ బ్యూరో: డబ్బులు ఇస్తేనే పని చేస్తానంటూ లంచం డిమాండ్‌ చేసిన వీఆర్వో ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంటలో తన భూమి మ్యుటేషన్‌ కోసం అంజలిదేవి అనే మహిళ దరఖాస్తు చేసుకుంది. మ్యుటేషన్ ప్రక్రియను గత ఆరు నెలలుగా గోనుగుంట వీఆర్వో శ్రీనివాసరావు పెండింగ్‌లో పెట్టారు. దీంతో అంజలిదేవి బంధువు వీఆర్వోను ఫోన్‌లో సంప్రదించారు. మూడు ఎకరాల 79 సెంట్ల భూమికి మ్యుటేషన్‌ చేయాలంటే ఎంత అవుతుందో రమణయ్య అనే వ్యక్తికి చెప్పానని వీఆర్వో తెలిపారు. తహాసీల్దార్‌తో ఒప్పించానని వీఆర్వో చెప్పుకొచ్చాడు.

ఇతర ప్రాంతాల్లో రూ.2 వేలకే మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని అంజలిదేవి బంధువు కోరాడు. కొండిపిలో రెండువేలకే చేస్తున్నారని వెల్లడించారు. అయితే కొండిపిలో రూ.1500కే మ్యుటేషన్ చేసినట్లు తెలిపారు. రూ.5 వేలు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని వీఆర్వో డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని రూ.3వేలు ఇస్తానని వీఆర్వోకు అంజలిదేవి బంధువు స్పష్టం చేశారు. అయినా వీఆర్వో ఒప్పుకోలేదు. అడిగిన సొమ్ము ఇస్తేనే మ్యుటేషన్ చేస్తానని లేదంటే లేదని తెగేసి చెప్పేశాడు. చీమకుర్తిలో ఉంటానని డబ్బులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పట్టుకుని రావాలని వీఆర్వో శ్రీనివాసరావు అంజలీదేవి బంధువును డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఆన్‌లైన్ బేరం ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ బేరంపై విచారణ చేపడతామని బాధితురాలికి పూర్తి న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed