మేనత్త కోరిక కాదనలేక.. కటకటాల పాలైన అల్లుడు

by  |
మేనత్త కోరిక కాదనలేక.. కటకటాల పాలైన అల్లుడు
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 20న విశాఖ నగర నడిబొడ్డున చోటుచేసుకున్న బాలుడి కిడ్నాప్‌ ను ఛేదించిన పోలీసులు, నలుగురు కిడ్నాపర్‌లను అరెస్టు చేశారు. సీపీ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపిన వివరాల్లోకి వెళ్తే… భిక్షాటన చేసుకుని జీవనం సాగించే దంపతులు సిరిమల్లిచెట్టు శ్రీను, భవాని తమ రెండేళ్ల కుమారుడు గణేష్‌తో ద్వారకానగర్ లోని టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని ఇరానీ టీస్టాల్‌ వద్ద ఈ నెల 20న సోమవారం నిద్రపోయారు. అదేరోజు రాత్రి 11:30 గంటల సమయంలో విజయనగరం పట్టణానికి చెందిన పటాన్‌ సల్మాన్‌ఖాన్, షేక్‌ సుభాని, బండారు రోషన్‌రాజు మద్యం మత్తులో టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో టిఫిన్‌ చేసేందుకు వచ్చి, కనిపించిన బాబును తీసుకుని ఆటోలో పరారయ్యారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని సుబట్ల గౌరికి బాబును అప్పగించారు. తల్లిదండ్రుల ఆందోళనతో స్థానికులు అప్రమత్తమై ఆటో నంబర్‌ (ఏపీ 35వై 3371) నమోదు చేసుకుని మరుసటిరోజు ఉదయం త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కిడ్నాప్ ఛేదించేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్‌లు విజయనగరం వెళ్లినట్లు గుర్తించి… ముగ్గురు యువకులను, ఓ మహిళను అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా నిందితుల్లో ఒకరైన బండారు రోషన్‌రాజు వరుసకు మేనత్త అయిన సుబట్ల గౌరి కోరిక మేరకే ఈ కిడ్నాప్‌ చేసినట్లు తేలింది. తన చెల్లెలుకి పిల్లలు లేరని, ఎవరినైనా తీసుకొచ్చి ఇస్తే పెంచుకుంటుందని చెప్పింది. దీంతో ఈ నెల 20న సాయంత్రం సల్మాన్‌ఖాన్, షేఖ్‌ సుభాని, రోషన్‌ రాజు విజయనగరం నుంచి సింహాచలంలో ఉంటున్న బంధువుల ఇంటికి రేషన్‌ బియ్యం, సరకులు తీసుకొచ్చారు. అనంతరం నగరంలోని టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడ కనిపించిన బాలుడు గణేష్‌ను కిడ్నాప్‌ చేశారని సీపీ వెల్లడించారు. ఆటోతోపాటు రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.

Next Story