'వివాదం నుంచి విశ్వాసానికి'!

by  |
వివాదం నుంచి విశ్వాసానికి!
X

దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుల్లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ‘వివాద్ సే విశ్వాస్’ అనే పథకాన్ని తెచ్చింది. గతంలోనే ఈ పథకం గురించి విపరీతమైన చర్చ జరిగింది. ఈ పథకం ద్వారా పన్ను వివాదాల్ని పరిష్కరించడానికి వీలవుతుందని, పన్ను చెల్లించేవారు వివాదాలను తొలగించుకోవడానికి ఎక్కువ సమయాన్ని, నగదును ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటువంటి ప్రయాస లేకుండా కొత్త పథకం ద్వారా వాటిని ఆదా చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

‘డైరెక్ట్ టాక్సెస్ వివాద్ సే విశ్వాస్ 2020’ అనే పేరుతో తెచ్చిన ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కేసులను పరిష్కరిస్తుంది. ఇప్పటి వరకు అన్ని రకాల అప్పిలేట్‌ల వద్ద మొత్తం 4,78,801 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులన్నిటి విలువ రూ.9 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చిలోపు వీలైనన్ని కేసులను పరిష్కరించి పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయంగా పెట్టుబడిదారులకు మార్గాలను సులభతరం చేయడానికి ఈ పథకాన్ని తెస్తున్నట్టు కేంద్రం చెబుతోంది. ఈ పథకం ద్వారా పన్నులకు సంబంధించి వివాదాలు ఉన్న కేసుల్లో పన్ను మొత్తాన్ని చెల్లిస్తే, ఇతర జరిమానాలు ఉండవు. అంతేకాకుండా క్షమాభిక్ష కల్పించి, భవిష్యత్తులో వివాదాలకు చట్టం పరిధిలో విచారణ లేకుండా చేసుకోవచ్చు.

ఐటీ శాఖ ఇచ్చిన డిమాండ్ నోటీసులను విభేదిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు 2020 మార్చి 31లోపు బకాయిలను చెల్లిస్తే.. దానిపై పెనాల్టీ, వడ్డీ లేకుండా రద్దవుతుంది. అప్పటికీ చెల్లించకపోతే జూన్ 30 వరకు రెండో విడత గడువు ఉంటుంది. అయితే, మార్చి 31లోపు చెల్లించకపోతే తర్వాత చెల్లించే మొత్తానికి 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2020 జనవరి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న కేసులకు ఈ పథకం వర్తిస్తుంది.

పన్ను చెల్లింపులు రూ. 5 కోట్ల లోపున్నాసరే సోదా కేసులుగా వర్తిస్తాయి. వివాదాలను తొలగించుకోవడానికి ఆదాయ పన్ను, పెనాల్టీ, వడ్డీల రూపంలో చెల్లించే మొత్తానికి అదనంగా 25 శాతం కలిపి 125 శాతాన్ని మార్చి నాటికి చెల్లించి వివాదాలను పరిష్కరించుకోవచ్చు. మార్చిలోపు చెల్లించలేనివారు జూన్ 31 నాటికి మరో 10 శాతం కలిపి మొత్తం 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో.. వడ్డీ, పెనాల్టీలపై వివాద కేసులుంటే, మార్చి చివరి నాటికి మొత్తం చెల్లించి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. గడువు దాటితే గనక జూన్ 31 నాటికి మొత్తం 110 శాతం కట్టాల్సి ఉంటుంది. అయితే, అన్ని రకాల వివాదాలకు ఈ పథకం వర్తించదు. ముఖ్యంగా, బయటకు చెప్పని విదేశీ ఆదాయం, సోదాలు జరిగాక రూ. 5 కోట్లకు పైగా స్వాధీనం కాబడిన కేసులు, విదేశీ ఆస్తులున్న కేసులు, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం విషయంలో విచారణ జరుగుతున్నా.. అలాంటి వారి వివాద కేసులు పరిష్కరించబడవు.


Next Story

Most Viewed