విశాఖయే బెటర్.. అమరావతి అంతా గ్రాఫిక్స్: బాలినేని శ్రీనివాసరెడ్డి 

by  |
Balineni Srinivasareddy
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన మహోద్య సభపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సెటైర్లు వేశారు. రైతుల మహోద్య వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వేదికపై ఈ నేతలు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతియే రాజధాని అని ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడూ ప్రకటించలేదన్నారు. బహుశా సీపీఐ రామకృష్ణకు మాత్రమే ఫోన్‌ చేసి చెప్పారేమో అంటూ చమత్కరించారు.

రాజధాని విషయంలో ఏనాడూ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం వైఎస్ జగన్‌కు ఎలాంటి ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. రాజధానిని కేవలం గ్రాఫిక్స్‌లో మాత్రమే చూపించిన చంద్రబాబు ప్రజా నేత సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో కరకట్టపై రోడ్డే వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని గమనించారు కాబట్టే ప్రజలు జగన్‌కు పట్టంకట్టారన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతమని.. అదే ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే అంతగా ఖర్చు ఉండదని చెప్పుకొచ్చారు. మరోవైపు వైసీపీ అసంతృప్తి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీ టికెట్‌పై గెలిచిన రఘరామ కృష్ణంరాజు వేదికపై సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారంటూ మండిపడ్డారు. రఘరామకు దమ్ము, దైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజనామా చేసి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలని మంత్రి బాలినేని సవాల్‌ విసిరారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణ విషయంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed