జాతీయ ఉద్యమంగా విశాఖ ఉక్కు పోరు..

by  |
జాతీయ ఉద్యమంగా విశాఖ ఉక్కు పోరు..
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం జాతీయ స్థాయికి చేరింది. ఈనెల 15 నుంచి పరిరక్షణ కమిటీ నేతలు ఢిల్లీలో పర్యటించారు. పలువురు ఎంపీలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. జాతీయ కార్మిక సంఘాల నేతలను కలిసి సంఘీభావం కోరారు. సంయుక్త కిసాన్​మంచ్​నేతలు కూడా మద్దతిస్తామన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అన్ని పార్టీల నుంచి మద్దతు కోరారు. శనివారం స్టీల్​ప్లాంటులోని త్రిష్ణ మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. సభకు సీఐటీయూ జాతీయ కార్యదర్శి తపన్​సేన్​, ఐఎన్​టీయూసీ నేత జీ సంజీవరెడ్డి, ఏఐటీయూసీ నుంచి అమర్​జిత్​కౌర్​, హెచ్‌ఎంఎస్​నుంచి రియాజ్​అహ్మద్, బీఎంఎస్​జాతీయ కార్యదర్శి డీకే పాంథే, వైఎస్సార్​టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీ గౌతంరెడ్డి, టీఎన్​టీయూసీ నేత జీ.రఘురామరాజు హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నెహ్రూ పార్కు నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తారు.

రెండు రోజుల క్రితం పార్లమెంట్ ఉభయ సభల్లో మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్​చేసిన ప్రకటనలు రాష్ట్రంలో మరింత వేడిని పుట్టించాయి. స్టీల్​ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని అనుబంధ యూనిట్లను సైతం అమ్మేస్తామని ప్రకటించారు. నూరు శాతం వాటాలను విక్రయించడానికే కేంద్రం నిర్ణయించుకున్నట్లు ఖరాఖండిగా చెప్పారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించే ఆలోచన లేదని పేర్కొన్నారు. దీంతో స్టీల్​ప్లాంటు నిర్వాసితులు గురువారం పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయకుండా ఉక్కు భూములను ఎలా అమ్ముతారని అధికారులను నిలదీశారు. మరోవైపు అధికార వైసీపీ ఎంపీలు ఉభయ సభల్లో విశాఖ స్టీలుపైనే పదేపదే ప్రశ్నలు సంధించారు. కేంద్రం ఇచ్చిన సమాధానంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మికులు రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు పోరాటం నుంచి వెనక్కు తగ్గమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉక్కు పరిరక్షణ సమితితో కలిసి వివిధ కార్మిక సంఘాలు 26న భారత్ బంద్‌కు పిలుపుని ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు ఇప్పటికే బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఉద్యమం తారా స్థాయికి చేరింది. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీ కరణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇటు స్టీల్ ప్లాంట్ పైన, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన దీక్ష చేస్తానని తెలిపారు.


Next Story

Most Viewed