వినోద్ కాంబ్లీని దోచేసిన సైబర్ నేరగాళ్లు

by  |
వినోద్ కాంబ్లీని దోచేసిన సైబర్ నేరగాళ్లు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీకి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ వేశారు. ముంబైలో ఉంటున్న వినోద్ కాంబ్లీకి డిసెంబర్ 3న గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. సదరు కాల్ లిఫ్ట్ చేయగా.. ఒక ప్రముఖ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని.. వెంటనే కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు పూర్తి చేయాలని కోరారు.

కాంబ్లీకి కూడా సదరు బ్యాంకు లోనే ఖాతా ఉండటంతో సరే అని చెప్పాడు. సైబర్ నేరగాళ్లు పంపిన ఒక లింక్ క్లిక్ చేసి థర్డ్ పార్టీ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం అందులో వివరాలు ఎంటర్ చేశాడు. నిమిషాల వ్యవధిలో పలుమార్లు ఓటీపీలు రావడమే కాకుండా అతడి అకౌంట్లో మల్టీపుల్ లావాదేవీల ద్వారా రూ. 1,13, 998 రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి అకౌంట్ బ్లాక్ చేయమని కోరాడు. ఈ విషయాన్ని ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైబర్ నేరగాళ్లు యాప్ సహాయంతో కాంబ్లీ ఫోన్‌ను రిమోట్ యాక్సస్ చేశారని.. అలా ఓటీపీ తెలుసుకొని వేరే అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేసుకున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే బ్యాంకు అధికారుల సహాయంతో బదిలీ అయిన సొమ్మును రివర్స్ ట్రాన్సాక్షన్ చేయించారు. ఇక ప్రస్తుతం కాంబ్లీ అకౌంట్ నుంచి ఎవరి ఖాతాలోకి సొమ్ము బదిలీ అయ్యిందో తెలుసుకునే పనిలో పడ్డారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌తో కలిసి స్కూల్ దశలో క్రికెట్ ఆడిన వినోద్ కాంబ్లీ 1991లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వినోద్ కాంబ్లీ భారత్ తరఫున 17 టెస్టు మ్యాచ్‌లు, 104 వన్డేలు ఆడాడు.

Next Story