అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకట్టాలని గ్రామస్థుల ఆందోళన

by  |
అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకట్టాలని గ్రామస్థుల ఆందోళన
X

దిశ, మానకొండూరు: అక్రమ ఇసుక ట్రాక్టర్లతో మేం వేగలేకపోతున్నాం.. దయచేసి వీటిని నిలువరించండి అంటూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. తమ బాధాలు పట్టించుకుని న్యాయం చేయండి సారూ అని వేడుకుంటున్న ఆ గ్రామ సర్పంచ్ భర్తను, గ్రామస్థులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానిక సర్పంచ్ మల్లం దీప ఆధ్వర్యంలో గ్రామస్థులు ఇసుక ట్రాక్టర్లను రోడ్డుపై నిలిపివేశారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తాము ఆందోళనకు దిగామని వివరించారు.

గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వందల సంఖ్యలో రోడ్డుపై నడపడం వలన ఇండ్లలోకి దుమ్ము చేరి ఆహార పదార్థాల్లో పడుతుండడం, రోడ్డువెంట ఉపాధి హామీతో పెట్టిన చెట్ల మొక్కలపై దుమ్ముపడి అవి ఎదగటం లేదని అంటున్నారు. ఇసుక ట్రాక్టర్లతో తమ గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికే అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ఇసుక ట్రాక్టర్లను నిలువరించాలని కోరుతున్నారు. ఇసుక రీచ్‌లను నిలిపివేసి తమను కాపాడాలని సర్పంచ్ దీప కోరుతున్నారు.

Next Story

Most Viewed